77.62 కోట్ల నగదు సీజ్: రజత్‌కుమార్‌

12 Nov, 2018 18:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మంత్రులు కుల సంఘాల మీటింగ్‌లలో పాల్గొనవద్దని, కుల సంఘాల సమావేశాల్లో పాల్గొనడం ఎన్నికల ఉల్లంఘనగా పరిగణిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. నామినేషన్ వేసినప్పటి నుంచి ఖర్చు లెక్కలోకి వస్తుందన్నారు. తొలిరోజు 43 నామినేషన్లు వచ్చాయని, ఇంకా 7 నియోజకవర్గాల నుంచి వివరాలు అందవల్సి ఉందన్నారు. ఎక్కువగా బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారని చెప్పారు. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో పోలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

ఇప్పటి వరకు రూ.77.62 కోట్ల నగదును సీజ్ చేసినట్టు రజత్‌ కుమార్‌ చెప్పారు. 4038 మద్యం దుకాణాలు తొలగించామన్నారు. 47,234 కేసులు నమోదయ్యాయన్నారు. సీ విజిల్ యాప్ ద్వారా 2251 ఫిర్యాదులు అందగా, 1279 పరిష్కరించామన్నారు. మొత్తం 2, 76, 29610 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని నోటీసులు ఇచ్చిన ముగ్గురు నేతలు బదులిచ్చారని పేర్కొన్నారు. తన మీద రాజకీయ ఒత్తిళ్లు లేవని రజత్ కుమార్ స్పష్టం చేశారు. బోగస్, డబుల్ ఓట్లు లక్ష 60 వేలు ఉన్నాయని, వాటి మీద కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామన్నారు.

మరిన్ని వార్తలు