డిగ్రీలో 1.4 లక్షల సీట్లు భర్తీ

16 Jun, 2017 02:18 IST|Sakshi

సీట్ల కేటాయింపు ప్రకటించిన ఉన్నత విద్యామండలి  
20లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలి


సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో భాగంగా 1,40,033 మంది విద్యార్థులకు ఉన్నత విద్యా మండలి సీట్లను కేటాయిం చింది. ఆరు యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు గత నెల 15న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 9 వరకు రిజిస్ట్రేషన్, వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించింది. వాటి సీట్ల కేటాయింపును గురువారం ఉన్నత విద్యా మండలి వైస్‌చైర్మన్లు, డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల కన్వీనర్‌ (దోస్త్‌), కోకన్వీనర్‌ వెంకటాచలం, మల్లేష్‌ ప్రకటించారు. వెబ్‌ ఆప్షన్లను ఇచ్చుకున్న 1,52,900 మందిలో 1,40,033 మందికి సీట్లను కేటాయించినట్లు తెలిపారు.

 కోర్టును ఆశ్రయించిన 14 కాలేజీలు ఆన్‌లైన్‌ పరిధిలో లేవని, 28 కాలేజీలు ఉన్నా కోర్టు కేసు ఉన్నందునా వాటిల్లో ఆప్షన్లు ఇచ్చిన 7,500 మందికి సీట్ల కేటాయింపు చేయలేదని వెల్లడించారు. కోర్టు తీర్పు మేరకు తదుపరి చర్యలు చేపడతామన్నారు. సీట్లు పొందిన విద్యార్థులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం పంపామన్నారు. విద్యార్థులు ఛీౌట్ట.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ నుంచి అలాట్‌మెంట్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని, ఈ నెల 20లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు.

నచ్చకపోతే మరో కాలేజీకి వెళ్లొచ్చు...
సర్టిఫికెట్ల వెరిఫికేషన్, సీటు కన్‌ఫర్మేషన్‌ కోసం కాలేజీలకు వెళ్లే విద్యార్థులను తమ కాలేజీల్లోనే చేరాలంటూ ఒత్తిడి చేస్తే, ఆ యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపడతామని వెంకటాచలం, మల్లేష్‌ చెప్పారు. అయితే ప్రతి విద్యార్థి ముందుగా సీటు వచ్చిన కాలేజీకి వెళ్లి సీట్‌ కన్‌ఫర్మ్‌ చేసుకోవాలన్నారు. ఒకవేళ ఆ కాలేజీలో చేరడం ఇష్టం లేకపోతే ముందుగా కన్‌ఫర్మ్‌ చేసుకున్నాకే రెండో దశ కౌన్సెలింగ్‌లో స్లైడింగ్‌కు వెళ్లాలన్నారు.విద్యార్థులు ముం దుగానే కాలేజీల్లో ఫీజులు చెల్లించవద్దని, ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వవదన్నారు.

17 నుంచి అథెంటికేషన్‌...
ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు, ఇప్పటివరకు డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోని వారు శనివారం నుంచి ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వారు వెల్లడించారు. ఈసేవా/హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో ఆధార్, బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ చేయించుకోవాలన్నారు. ఆ తరువాత వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఈ నెల 21 నుంచి 24 లోగా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు. ఇప్పటికే సీట్లు పొందిన వారు స్లైడింగ్‌కు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, ఈనెల 28న వారికి సీట్లను కేటాయిస్తామన్నారు.

రెండో దశ, చివరి దశ కౌన్సెలింగ్‌ వివరాలు...
జూన్‌ 17 నుంచి 20 వరకు: హెల్ప్‌లైన్‌/ఈసేవా కేంద్రాల్లో కొత్త విద్యార్థుల ఆధార్, బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌; రిజిస్ట్రేషన్‌.
జూన్‌ 21–24: ఆన్‌లైన్‌లో వెబ్‌ ఆప్షన్లకు అవకాశం
జూన్‌ 28: సీట్లు కేటాయింపు
జూన్‌ 29– జూలై 3: సీట్లు పొందిన
వారు కాలేజీల్లో రిపోర్టింగ్‌
జూలై 4–8: చివరి దశ వెబ్‌ ఆప్షన్లు
జూలై 13: చివరి దశ సీట్లు కేటాయింపు
జూలై 14–18: సీట్లు పొందిన వారు కాలేజీల్లో రిపోర్టింగ్‌

>
మరిన్ని వార్తలు