సహకరించని..‘దోస్త్‌’

14 May, 2018 09:07 IST|Sakshi
దోస్త్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఆధార్‌తో మొబైల్‌ నంబర్‌ లింక్‌ ఉండాలన్న నిబంధన (వృత్తంలో)

డిగ్రీ దరఖాస్తుకు తిప్పలు

ఆధార్‌కు మొబైల్‌నంబర్‌ అనుసంధానం ఉంటేనే అవకాశం

‘లింక్‌’ నిబంధనతో విద్యార్థుల ఇక్కట్లు

అనుసంధానం చేయాలంటే కనీసం వారం సమయం

ఈ నెల 26తో ముగియనున్న దరఖాస్తు గడువు

సాక్షి, బోథ్‌: డిగ్రీ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే వి ద్యార్థులకు ఆధార్‌కు మొబైల్‌ నంబర్‌ అనుసంధా నం నిబంధన తిప్పలు పెడుతోంది. ఈ లింక్‌ ఉంటేనే దోస్త్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకు నే అవకాశం ఉంది. అయితే చాలా మంది వి ద్యార్థులకు తమ మొబైల్‌ నంబర్లు ఆధార్‌తో అనుసంధా నం లేకపోవడంతో దరఖాస్తు చేయలేకపోతున్నా రు. అనుసంధానం చేయాలంటే కనీసం వారం, పది రోజుల సమయం పట్టే అవకాశం ఉండడం.. మరో వైపు దరఖాస్తు గడువు సమీపిస్తుండడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.

అనుసంధానం ఉంటేనే దరఖాస్తు..
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి రెండేళ్లుగా ‘దోస్త్‌’ వెబ్‌సైట్‌ ద్వారా డిగ్రీలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. గతంలో ఆధార్‌తో మొబైల్‌నంబర్‌ అనుసంధానం లేకపోయినా దరఖాస్తులను స్వీకరించారు. అయితే ఈ ఏడాది ఖచ్చితంగా అనుసంధానం ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలని వెబ్‌సైట్‌లో నిబంధన పెట్టడంతో చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేయలేకపోతున్నారు. అనుసంధానం నిబంధనను ఎత్తివేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

గతంలో ఇలా...  
డిగ్రీలో ప్రవేశాలకు గతంలో ‘మీసేవ’లో బయోమెట్రిక్‌ విధానం ద్వారా దోస్త్‌ వెబ్‌సైట్‌లో విద్యార్థులు నమోదు చేసుకుని తాము ఎంచుకున్న కళాశాలలకు, గ్రూపుల వారీగా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేవారు. ఈ విధానంలో ఆధార్‌ నంబర్‌కు మొబైల్‌నంబర్‌ అనుసంధానం అవసరం ఉండేది కాదు. విద్యార్థుల మొబైల్‌ నంబర్‌ను నమోదు చేసుకుంటే ఆ నంబర్‌కు యూసర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వచ్చేది. ఈ విధానంతో రెండేళ్లుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు డిగ్రీలో ప్రవేశాలు పొందారు. కాగా, గతంలో మీసేవ నిర్వాహకులు అధిక డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వెలువెత్తాయి. 

లింక్‌తోనే తిప్పలు...
2018–19లో డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 8న ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 10వ తేదీ నుంచి 26వ తేదీ వరకు విద్యార్థులు దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా డిగ్రీలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించింది. గతంలో జరిగిన పొరపాట్ల నేపథ్యంలో ఈ సారి విద్యార్థుల ఆధార్‌తో వారి మొబైల్‌ నంబర్‌ అనుసంధానం చేయాలని నిబంధన విధించింది. దీంతో పాటు మీ సేవకు వెళ్లకుండా విద్యార్థులు నేరుగా దోస్త్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.  

లింక్‌ చేయాలంటే వారం సమయం..
ఉన్నత విద్యామండలి నిబంధన మేరకు విద్యార్థులు తమ ఆధార్‌ నంబర్‌కు మొబైల్‌ నంబర్‌ను లింక్‌ చేయాలంటే దాదాపు వారం నుంచి పది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. తమ ప్రాంతంలో ఉండే ఆధార్‌ సెంటర్‌కు వెళ్లి మొబైల్‌ నంబర్‌ను ఆధార్‌తో లింక్‌ చేసుకోవాలి. దీనికి దాదాపు విద్యార్థులు రూ. 30 నుంచి రూ. 50 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అనుసంధానం ఎక్కడ చేస్తారో కూడా చాలా మంది విద్యార్థులకు అవగాహన లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. లింక్‌ నిబంధనను వెంటనే తొలగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2017–18లో ఇంటర్‌ పాసైన విద్యార్థులు..
జిల్లా                     పాసైన విద్యార్థులు    
ఆదిలాబాద్‌             5,350    
మంచిర్యాల             3,884    
నిర్మల్‌                  3,941    
కుమురంభీం           3013    
మొత్తం                 16,188     

మరిన్ని వార్తలు