బాలికపై టీడీపీ నేత లైంగికదాడి

27 Mar, 2017 17:30 IST|Sakshi
హైదరాబాద్‌: బిస్కెట్‌ ప్యాకెట్‌ను ఆశగా చూపి ఓ గిరిజన బాలికపై అత్యాచారం చేశాడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు చెందిన కోవూరి అయ్యప్ప, లక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె(12) తల్లికి తోడుగా ఇళ్లల్లో పాచి పనిచేస్తుంటుంది.
 
నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు,  జిల్లా వ్యాపారుల సంఘం అధ్యక్షుడు పసుపులేటి నరసింహారావు బాలికకు బిస్కెట్‌ ప్యాకెట్‌ ఇచ్చి ఈ నెల 12వ తేదీన ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పోలీసులకు పిర్యాదు చెయ్యగా నరసింహరావును అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. నెల్లూరు మంత్రి నారాయణ ఇందులో కలగజేసుకుని కేసును నీరుగార్చేందుకు పూనుకున్నట్లు బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు, గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఆరోపించారు.
 
సోమవారం నారాయణగూడ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్టాడుతూ బాధితురాలి తల్లిదండ్రులు పిర్యాదు చేసినా కేసు నమోదు చెయ్యలేదని తెలిపారు. దీంతో నెల్లూరు 5వ పట్టణ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయగా స్పందించిన పోలీసులు నరసింహారావుపై ఫొక్సోయాక్ట్, ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్‌ చేస్తున్న తరుణంలో మంత్రి నారాయణ నేరుగా బాధితురాలి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. అనంతరం 15వ తేదీ నుంచి బాధితురాలు, కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. రాష్ట్రంలో ఇంత దారుణం జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకుండా మౌనంగా ఉండటం దారుణమని వారన్నారు. తక్షణం నిందితుడ్ని అరెస్ట్‌ చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్‌ చేశారు.
మరిన్ని వార్తలు