కాంగ్రెస్‌కే పూర్తి మెజారిటీ.. ఇండియా టుడే సర్వే

2 Dec, 2023 01:32 IST|Sakshi

ఇండియా టుడే– యాక్సిస్‌ మైఇండియా ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా 

కాంగ్రెస్‌కు 42 శాతం ఓట్లతో 63–73 స్థానాలు 

బీఆర్‌ఎస్‌కు 32 శాతం ఓట్లతో 34–44 స్థానాలు 

బీజేపీకి 4–8 సీట్లు.. ఎంఐఎం సహా ఇతరులకు 5–8 సీట్లు 

ప్రభుత్వ వ్యతిరేకత, సిట్టింగ్‌లపై ప్రజాగ్రహం ప్రభావం చూపినట్టు వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సీట్లను సాధిస్తుందని ఇండియా టుడే– యాక్సిస్‌ మైఇండియా ఎగ్జిట్‌పోల్‌ సర్వే పేర్కొంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను.. అధికార బీఆర్‌ఎస్‌కు 36 శాతం ఓట్లతో 34–44 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌ పార్టీ 42 శాతం ఓట్లతో 63–73 సీట్లు సాధించి అధికారంలోకి   వస్తుందని అంచనా వేసింది. బీజేపీకి 14శాతం ఓట్లతో 4 నుంచి 8 సీట్లు రావొచ్చని.. ఎంఐఎం 8శాతం ఓట్లతో 5–7 సీట్లు సాధించవచ్చని తెలిపింది.

రాష్ట్రంలో గురువారం పోలింగ్‌ ముగియగానే.. జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలను విడుదల చేశాయి. చాలా వరకు కాంగ్రెస్‌ వైపు మొగ్గు ఉన్నట్టు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఇండియా టుడే– యాక్సిస్‌ మైఇండియా శుక్రవారం తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ సర్కారుపై వివిధ వర్గాల ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత ఎగ్జిట్‌పోల్‌ సర్వేలో కనిపించిందని పేర్కొంది. ముఖ్యంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో చాలా మందికి మళ్లీ టికెట్‌ ఇవ్వడం, వారిపై స్థానికంగా నెలకొన్న తీవ్ర వ్యతిరేకత ప్రభావం చూపిందని విశ్లేషించింది. 

ప్రాంతాల వారీగా పరిశీలన జరిపి 
రాష్ట్రంలో ఉత్తర, మధ్య (సెంట్రల్‌), దక్షిణ తెలంగాణ, హైదరాబాద్‌ ప్రాంతాల వారీగా ఇండియాటుడే–యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ను విడుదల చేసింది. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరీ పోరు సాగిందని.. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌దే పైచేయిగా ఉందని వివరించింది. దక్షిణ, మధ్య తెలంగాణలలో కాంగ్రెస్‌ పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచిందని, ఈ ప్రాంతాల నుంచే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. 
► ఉత్తర తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు 13, కాంగ్రెస్‌కు 15, బీజేపీకి 5 సీట్లు రావొచ్చని పేర్కొంది. 
►  దక్షిణ తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు 6, కాంగ్రెస్‌కు 27, బీజేపీకి ఒక స్థానం వస్తాయని అంచనా వేసింది. 
► 
 మధ్య తెలంగాణలో బీఆర్‌ఎస్‌ 9, కాంగ్రెస్‌ 22 సీట్లు సాధించవచ్చని తెలిపింది. 
 హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ 11, కాంగ్రెస్‌ 3, బీజేపీ 1, ఎంఐఎం 6 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. 
► 
తెలంగాణ తదుపరి సీఎంగా కేసీఆర్‌ ఉంటే బాగుంటుందని 32శాతం మంది, రేవంత్‌రెడ్డి కావాలని 21 శాతం మంది, ఇతర కాంగ్రెస్‌ నాయకుడు సీఎం కావాలని 22 శాతం మంది, బీజేపీ నాయకుడు ఉంటే బాగుంటుందని 12 శాతం మంది తమ సర్వేలో పేర్కొన్నట్టు వెల్లడించింది. 

ఇండియా టుడే– యాక్సిస్‌ మైఇండియా ఎగ్జిట్‌పోల్‌ అంచనాలివీ 
పార్టీ--         సీట్లు--    ఓట్ల శాతం 
బీఆర్‌ఎస్‌    34–44    32 శాతం 
కాంగ్రెస్‌      63–73    42 శాతం 
బీజేపీ         4–8    14 శాతం 
ఇతరులు (ఎంఐఎం సహా)    5–8    (ఎంఐఎం–8%, ఇతరులు–4%)   

మరిన్ని వార్తలు