నేడే నోటిఫికేషన్‌

12 Nov, 2018 20:04 IST|Sakshi

నియోజకవర్గాల వారీగా..

జారీ చేయనున్న అధికారులు

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

22 వరకు ఉపసంహరణకు గడువు

డిసెంబర్‌ 7న పోలింగ్, 11న ఫలితాల వెల్లడి

సార్వత్రిక సమరం ఇక నుంచి మరింత వేడెక్కనుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ నేడు జారీ కానుండడంతో పోరు మరింత హోరెత్తనుంది. సోమవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే, ఈ నెల 14న పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది

సాక్షి,ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలకమైన ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. నియోజకవర్గాల వారీగా ఎన్నికల నోటిఫికేషన్‌ నేడు (సోమవారం) జారీ కానుంది. ఇదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభించనున్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశానుసారం జిల్లాలో ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించడానికి తొలుత నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. ఈ నెల 19 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 20న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణకు అవకాశముంటుంది. డిసెంబర్‌ 7వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. 11వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. కౌంటింగ్‌ నిర్వహించడానికి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిల్‌ కళాశాలను ఎంపిక చేసినట్లు కలెక్టర్‌ రామ్మోహన్‌రావు ప్రకటించారు. ఇక్కడే ఈవీఎంలు, యూనిట్ల పంపిణీ కూడా జరగనుంది. మొత్తంగా ఎన్నికల ప్రక్రియ డిసెంబర్‌ 13వ తేదీతో ముగియనుంది.

 సమయానుసారమే.. 

ఉదయం 10 గంటల ప్రాంతంలో రిటర్నింగ్‌ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేసిన అనంతరం, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నికల కమిషన్‌ నిర్ణయించిన ఈ సమయమే నామినేషన్ల చివరి తేదీ వరకు అమలు కానుంది. నిర్ణీత సమయంలోగా అభ్యర్థుల నుంచి నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు స్వీకరిస్తారు. ఆలస్యమైతే నామినేషన్లు తీసుకునే అవకాశం ఏ మాత్రం లేదు.

నియోజకవర్గాల వారీగా..

జిల్లాలో బాన్సువాడతో కలిపి మొత్తం ఆరు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆర్మూర్‌ నియోజక వర్గానికి రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌వో) గా ఆర్మూర్‌ ఆర్డీవో ఉండగా, స్థానిక తహసీల్‌ కా ర్యాలయంలో నామినేషనలను స్వీకరిస్తారు. అలా గే, బోధన్‌ నియోజకవర్గానికి రిటర్నింగ్‌ అధికారిగా బోధన్‌ ఆర్డీవో వ్యవహరించనున్నారు. బోధ న్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గానికి రిటర్నింగ్‌ అధికారిగా నగరపాలక కమిషనర్‌ వ్య వహరిస్తుండగా, మున్సిపల్‌ కార్యాలయంలో నా మినేషన్లను స్వీకరిస్తారు. నిజామాబాద్‌ రూరల్‌ ని యోజకవర్గానికి రిటర్నింగ్‌ అధికారిగా నిజామాబాద్‌ ఆర్డీవో వ్యవహరిస్తున్నారు. ఆయన కార్యాలయంలోనే నామినేషన్లను స్వీకరిస్తారు. బాల్కొండ నియోజకవర్గానికి జిల్లా పరిషత్‌ సీఈవో రిటర్నిం గ్‌ అధికారిగా ఉండగా, భీమ్‌గల్‌ తహసీల్దార్‌ కా ర్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గానికి డీఆర్‌డీవో రిటర్నింగ్‌ అధికారిగా ఉండగా, స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నారు.

భారీ బందోబస్తు.. 

నామినేషన్‌ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారం భం కానున్న నేపథ్యంలో రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్ల స్వీకరణ సమయాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చింది. అయితే, నామినేషన్లు సమర్పించడానికి వచ్చే అభ్యర్థులు ర్యాలీలతో వచ్చే అవకాశం ఉండడంతో రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యాలయాలకు కొద్ది దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు, నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే లోనికి అనుమతించనున్నారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో వీడియో చిత్రీకరణ, ఫొటోల కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక సిబ్బందిని నియమించిం ది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌రావు, పోలీసు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.   

మరిన్ని వార్తలు