నల్లగొండ: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యం నూతనంగా ప్రైవేట్ డ్రైవర్ల దరఖాస్తులను కోరింది. ఈ నేపథ్యంలో దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన అభ్యర్థులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ సంఘటన బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బస్టాండ్లో జరిగింది.
విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. బస్టాండ్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. కాగా, ఆర్టీసీ యాజమాన్యం దరఖాస్తులను ఆహ్వానిస్తేనే తాము వచ్చినట్లు బస్టాండ్లో ఉన్న ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లు తెలిపారు.
(మిర్యాలగూడ)