పోలీసుల ఆధీనంలో ఉప్పల్‌ స్టేడియం

6 Apr, 2018 15:48 IST|Sakshi
ఉప్పల్‌ స్టేడియం, మహేష్‌ భగవత్‌ (ఇన్‌సెట్‌లో)

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌ సీజన్‌ రేపటి నుంచి మొదలు కానుంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఉప్పల్ స్టేడియానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఉప్పల్‌లో మొత్తం 7 ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయని.. ఈ నేపథ్యంలో రేపటి నుంచి స్టేడియంను తమ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. 2,500 మంది పోలీసులతో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు భద్రత కల్పిస్తామన్నారు. స్టేడియం ప్రాంగణంలో 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు సీపీ తెలిపారు. మ్యాచ్ ఉన్న రోజు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయన్నారు.

ఈ క్రమంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఆయన సూచించారు. ఏప్రిల్ 9, 12, 22, 26, మే 5, 7, 19 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు జరుగనున్న మ్యాచ్‌( ఏప్రిల్‌ 22)కి వచ్చే వారికి మధ్యాహ్నం 1 గంట నుంచి అనుమతి ఉంటుందని , రాత్రి 8 గంటల మ్యాచ్‌లకి సాయంత్రం 5  గంటల నుంచి అనుమతి ఇస్తామన్నారు. మ్యాచ్‌లకు వచ్చేవారు ఒక సెల్ ఫోన్ మినహా, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, తిను బండరాలు కానీ అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు