శాశ్వత కట్టుడు పళ్ల చికిత్స

10 Nov, 2019 02:23 IST|Sakshi

ట్రెఫాయిల్‌ ఇంప్లాంట్‌ పద్ధతిలో విజయవంతంగా చికిత్స

తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలి చికిత్సగా వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని సరిత దంత ఆస్పత్రి వైద్యులు ఓ మహిళకు ట్రెఫాయిల్‌ ఇంప్లాంట్‌ పద్ధతిలో శాశ్వత స్థిరమైన కట్టుడు పళ్లను విజయవంతంగా అమర్చారు. శనివారం హోటల్‌ ఎన్‌కేఎం గ్రాండ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సరిత ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆకాష్‌ చక్రవర్తి, డాక్టర్‌ దేవ్‌జ్యోతి ముఖర్జీ ఈ చికిత్స వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నాగరాజకుమారి (54) గత మూడేళ్ల నుంచి దంతాల సమస్యతో బాధపడుతుంది. చికిత్స కోసం సైనిక్‌పురిలోని సరిత డెంటల్‌ క్లినిక్‌ వైద్యులను సంప్రదించింది.

పరీక్షించిన వైద్యులు దంత వైద్య రంగంలో ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ట్రెఫాయిల్‌ ఇంప్లాంట్‌ టెక్నాలజీ సహాయంతో శాశ్వత, స్థిరమైన పళ్లను అమర్చాలని నిర్ణయించారు. ఈ చికిత్సలో అప్పటికే శిక్షణ పొందిన డాక్టర్‌ ఆకాష్‌ చక్రవర్తి, డాక్టర్‌ దేవ్‌జ్యోతి, డాక్టర్‌ పావని, డాక్టర్‌ సాయిప్రియల బృందం ఇటీవల ఆమెకు విజయవంతంగా చికిత్స చేశారు. భారతదేశంలో ఈ తరహా చికిత్సలు రెండు జరిగినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిదని డాక్టర్‌ ఆకాష్‌ చక్రవర్తి ప్రకటించారు.  

మరిన్ని వార్తలు