నో పోలీస్.. నో చట్టం.. పెదరాయుళ్ల తీర్పులు!

14 May, 2015 14:05 IST|Sakshi
నో పోలీస్.. నో చట్టం.. పెదరాయుళ్ల తీర్పులు!

కైకలూరు : కొల్లేరు లంక గ్రామాల్లో చట్టాలకు సమాంతరంగా పెద్దలు తీర్పులు కొనసాగుతున్నాయి. చిన్న చిన్న సమస్యలను గ్రామస్థాయిలో పరిష్కరించుకోవడానికి పూర్వం పెద్దలు నడుం బిగించేవారు. దీంతో బాధితులకు న్యాయం జరిగేది. నేడు ఆ పరిస్థితి లేదు. కొల్లేరు కట్టుబాట్ల నడుమ ఓటు బ్యాంకు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. లంక గ్రామాల్లో మాట వినకపోతే మూకుమ్మడి వేధింపులు ఎక్కువవుతున్నాయి.
 
కొల్లేరు అభయారణ్య పరిధిలోని 120 జీవోకు మట్టిపాతర వేస్తూ అక్రమ చేపల చెరువులను యథేచ్ఛగా కొనసాగిస్తున్న పెద్దలను ఇదేంటని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నారు.  ఇటీవల కొల్లేరు గ్రామాల్లో జరిగిన సంఘటనలు పె ద్దల పెత్తనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
 
మండవల్లి మండలం పులపర్రు గ్రామానికి చెందిన మోరు ఆశామణి అదే గ్రామానికి చెందిన మల్లేపూడి క్రాంతి ప్రేమించుకున్నారు. ఇద్దరూ మేజర్లు. కులాలు వేరు కావడంతో గత నెల 29న చర్చి వివాహం చేసుకున్నారు. ఈ నెల 7న వారు మండవల్లి పోలీసులను కలిసి రక్షణ కల్పించాలని కోరారు. ఈ నెల 11న గ్రామంలోని కొల్లేరు పెద్దలు పంచాయతీ పెట్టారు. ఇంతలో మహిళలు పెద్దసంఖ్యలో వచ్చి సదరు యువతిని ఈడ్చూకుంటు వెళ్ళిపోయారు. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను నిర్బంధించారు. దీంతో ఆ యువకుడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. యువతి అచూకీ ఇప్పటివరకు తెలియలేదు.  
 
కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను కొల్లేరు పెద్దల సమక్షంలో ఇటీవల కొందరు చితకబాదారు. సదరు వ్యక్తుల వాహనాలను దేవాలయం వద్దకు పంపకపోవడమే పోలీసులు చేసిన నేరం. ఈ ఘటనపై   ప్రజాప్రతినిధులు కొమ్ముకాయడంతో పోలీసులే ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.
 
కొల్లేరు అభయారణ్య పరిధిలోని అక్రమ చేపల చెరువుల్లో చేప పిల్లలను వదలడానికి ఓ పడవపై కొల్లేరు పెద్దల సమక్షంలో చేప పిల్లల డాబ్బాలను తీసుకువస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు ఓ అటవీశాఖ క్షేత్రస్థాయి ఉద్యోగి పడవలో ఎక్కాడు. కొంత దూరం వచ్చిన అతన్ని కొట్టి కొల్లేటిలోకి తోసేశారు. చేప పిల్లల వదలడాన్ని అడ్డుకోడానికి వచ్చిన అటవీ అధికారులను నిర్బంధించారు.  అటవీ సిబ్బంది పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టాడు. పెద్దల జోక్యంతో కేసు నీరుగారింది.


కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంకు భక్తులు చేరడానికి పందిరిపల్లిగూడెం వద్ద వంతెన ఉంది. నిబంధనలు విరుద్ధంగా టోల్‌గేటు వసూలు చేస్తున్నారు. ఈ విషయంలో సదరు పాటదారునికి ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు గొడవ జరిగింది. దీనిపై పాటదారుడి ఫిర్యాదుతో పోలీసు కేసు నమోదైంది. పెద్దలు రంగ ప్రవేశం చేసి ఎదురు కేసు పెట్టారు. దీంతో ఆ కేసు నీరుగారింది
 
గోకర్ణపురానికి చెం దిన ఓ మూడేళ్ల బాలికపై ఓ కామాం ధుడు లైంగికదాడి చేసి చంపేశాడు. మొదట్లో ఈ ఘాతకం వెలుగుచూడలేదు. సరైన శిక్ష పడకపోవడంతో అదే వ్యక్తి మరో మహిళపై అఘయిత్యానికి పాల్పడ్డాడు. అదే విధంగా పంచికలమర్రు గ్రామంలో పెద్దల మాట కాదన్నందుకు ఓ కుటుం బాన్ని గతంతో రామాలయంలో బంధించారు. మీడియా సంఘటనను వెలుగులోకి తీసుకురావడంతో కుటుంబాన్ని విడిచిపెట్టారు.  
 
ప్రేక్షక పాత్రలో పోలీసులు
కొల్లేరు పెద్దలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటుంటే పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. కొల్లేటికోటలో పోలీసులపై దాడి చేసిన వారికి సరైన శిక్ష పడలేదని సిబ్బందికి ఇప్పటికి మధనపడుతున్నారు. అటవీశాఖ అధికారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొల్లేరు పెద్దల మాట కాదంటే మరోసటి రోజు బదిలీలకు రంగం సిద్ధం చేసేస్తున్నారు. 

మరిన్ని వార్తలు