'వాళ్లిద్దరి పెళ్లికి మేమంతా ఒప్పుకున్నాం'

28 Aug, 2015 16:20 IST|Sakshi
షీనాతో రాహుల్(ఫైల్)

డెహ్రడూన్: షీనా బోరా హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాహుల్ ముఖర్జియా, షీనా బోరా మూడేళ్ల క్రితమే  పెళ్లి చేసుకోవాలనుకున్నారని వెల్లడైంది. వీరి వివాహానికి పీటర్ ముఖర్జియా మొదటి భార్య షబ్నం కుటుంబం మొత్తం అంగీకరించిందని తెలిసింది.

పెళ్లికి తన తల్లి అంగీకారం కోసం 2011లో షీనాను రాహుల్ తీసుకొచ్చాడని షబ్నం తమ్ముడు షలీన్ తెలిపాడు. షీనా తమ కుటుంబ సభ్యులందరికీ ఎంతో నచ్చిందని చెప్పాడు. అందరితో కలిసిపోవడమే కాకుండా, పెద్దల పట్ల ఆమె చూపించిన గౌరవాభిమానాలు తమందరినీ ఆకట్టుకున్నాయన్నారు. దీంతో తామందరం రాహుల్, షీనా పెళ్లికి ఏకగ్రీవంగా అంగీకారం తెలిపామని చెప్పారు. కొద్ది రోజుల్లోనే వాళ్ల పెళ్లి జరుగుతుందని భావించామన్నారు.

షీనా హత్యకు గురైందన్న విషయం వార్తా చానళ్ల ద్వారా తెలిసిందన్నారు. ఆమె హత్యకు గల కారణాలు తెలియదని చెప్పారు. చురుకైన షీనాను పొట్టన పెట్టుకున్న వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలకూడదని, హంతకులను కఠినంగా శిక్షించాలని షలీన్ డిమాండ్ చేశారు. మోడల్, టీవీ నటుడైన 49 షలీన్ కు జోగివాలా ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్కూల్ నడుపుతున్నారు.

మరిన్ని వార్తలు