తుది అంకానికి తెలంగాణ బిల్లు

6 Feb, 2014 16:50 IST|Sakshi

న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లు తుది అంకానికి చేరింది. సోమవారం తెలంగాణ బిల్లు పార్లమెంట్‌ ముందుకు రానున్నట్టు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. గురువారం  బిల్లుపై తుది కసరత్తులు పూర్తి చేసిన జీవోఎం శుక్రవారం క్యాబినెట్‌ ముందు ప్రవేశపెట్టనుంది.  గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీలో  తెలంగాణ బిల్లుకు కొన్ని సవరణలు చేసినట్టు తెలిసింది.

ప్రధానంగా సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే విషయంపై ఈ సవరణలు ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ బిల్లులో 42వ ప్రతిపాదనలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంశం ఉంది. ఆర్థిక సంఘం సిఫార్సులకు సంబంధించి ఇందులో కీలక సవరణ చేసినట్టు తెలిసింది. ఈ మార్పులతో రేపు క్యాబినెట్‌ ముందుకు దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి వర్గం శుక్రవారం  ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ భేటీలో తెలంగాణ బిల్లును ఆమోదిస్తారని, అనంతరం సోమవారం లోక్‌సభ ముందు తెలంగాణ బిల్లును ప్రవేశపెడతారని ఢిల్లీ వర్గాల సమాచారం.
 

మరిన్ని వార్తలు