భార్యను చంపి.. ప్రియురాలి భర్తను ఇరికించి!

7 Sep, 2015 15:20 IST|Sakshi
భార్యను చంపి.. ప్రియురాలి భర్తను ఇరికించి!

అతడో సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన భార్యను చంపేశాడు.. ప్రియురాలి భర్తను వేరే కేసులో ఇరికించి తామిద్దరం హాయిగా ఉందామనుకున్నాడు. తీరా చూస్తే.. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. సినిమా ట్విస్టులను తలపించే ఈ ఘటన బెంగళూరులో జరిగింది.  ఎంజీ గోకుల్ (33) అనే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు అప్పటికే పెళ్లయింది కూడా. దాంతో ఆమె భర్త అడ్డు తొలగించుకోడానికి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ చేశాడు. అందుకోసం.. చాలా పెద్ద పథకమే వేశాడు.

ముందుగా ఆమె భర్త పాస్పోర్టు దొంగిలించి, దాన్ని ఆధారంగా చూపించి అతడి పేరు మీద సిమ్ కార్డు కొనుగోలు చేశాడు. అలాగే, ఫేస్బుక్లో అతడి పేరుమీద ఓ పేజీ క్రియేట్ చేశాడు. అందులో అతడిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడిగా చూపించాడు. సైబర్ క్రైం పోలీసులకు దాని ఆచూకీ చిక్కాలని చూశాడు. కానీ అలా జరగలేదు. దాంతో, బెంగళూరు విమానాశ్రయానికి ఫోన్ చేశాడు. కానీ అక్కడ ఎవరూ ఫోన్ ఆన్సర్ చేయకపోవడంతో.. ఢిల్లీ విమానాశ్రయానికి కాల్ చేసి, మూడు విమానాల్లో బాంబులు ఉన్నాయని బెదిరించాడు. తర్వాత బెంగళూరు విమానాశ్రయానికి కూడా అలాంటి బెదిరింపులే వాట్సప్ మెసేజి ద్వారా పంపాడు.

పోలీసులు కూడా మొదట సిమ్ కార్డు వివరాల ఆధారంగా అతడి ప్రియురాలి భర్తనే అనుమానించారు. కానీ, తర్వాత విషయం తెలిసి గోకుల్ను అరెస్టు చేశారు. ఇందులో ఉగ్రవాద కోణం ఏమీ లేదని,  అయితే.. నిందితుడి భార్య అనూరాధ కొన్ని నెలల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంతో ఆ కేసును ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు పోలీసు కమిషనర్ తెలిపారు. తన భార్యపై దాడి చేయడంతో ఆమె చనిపోయినట్లు గోకుల్ అంగీకరించాడని అంటున్నారు.

మరిన్ని వార్తలు