ఈ సమయం.. అగ్గికి అనుకూలం

26 Nov, 2014 01:54 IST|Sakshi

ముందు జాగ్రత్త చర్యలు  
 నత్రజని ఎరువును తక్కువగా వేయడం, పొటాష్ ఎరువును ప్రతిసారీ ఎకరాకు 15 కేజీల చొప్పున వినియోగించడం, పొలం గట్లపై కలుపు మొక్కలు, గరిక తొలగించడం, పొట్ట దశలో 50 శాతం, వెన్నుదశలో ఒకసారి ట్రైసైక్లోజోల్ పొడి మందు 100 గ్రాములను 100 లీటర్ల నీటికి లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారీ చేయాలి.

 అగ్గి తెగులు వ్యాప్తి ఇలా..
 వాతావరణం చల్లగా ఉండి, గాలిలో తేమ ఎక్కువగా ఉంటే వరి ఆకుల అంచు వెంట ముదురు గోధమ రంగులో నూలుకండె ఆకారంలో, ఆకుల మధ్యలో బూడిద రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తాయి. ఈ లక్షణాలను అగ్గి తెగులు అంటారు. మంచు కురవడం, వర్షపు చిరు జల్లులు పడటం, నత్రజని ఎరువులు అధికంగా వాడటం వల్ల ఈ తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది. వెన్ను మొదటి భాగంలో కణుపుల వద్ద అగ్గి తెగులు వస్తే వెన్ను విరిగి కిందకు వాలిపోతాయి. గింజలు సరిగా పాలు పోసుకోకపోవడం వల్ల ఎక్కువ శాతం తాలు గింజలు ఏర్పడతాయి.

 సుడిదోమ, దోమపోటు
 గోధుమ రంగులో ఉన్న దోమలు గుంపులుగా నీటి పైభాగాన దుబ్బులపై ఉండి రసాన్ని పీల్చడం వల్ల ఆకు, మొక్కలు పసుపు రంగులోకి మారి క్రమంగా సుడులు సుడులుగా ఎండిపోతాయి. చిన్న చిన్న రెక్కలు గల పురుగులు పూతదశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. తల్లిపురుగులు ప్రత్యేక కాళ్ల నిర్మాణం వల్ల అవి ఒక మూలగా కదులుతాయి. అన్ని పురుగులు మూలగా తిరగడం వల్ల పైరు సుడులుగా చనిపోతుంది. అందుల్లే వీటిని సుడిదోమ అని అంటారు. పైరు వెన్ను దశలో 20 నుంచి 25 పురుగులు ఉన్నట్లయితే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి.

పొలంలో నాట్లు వేసే సమయంలో ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ చొప్పున తూర్పు, పడమర దిశలో కాలిబాటలు వదలాలి. పొలంలో నీటి మట్టం ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడూ పొలాన్ని ఆరబెడుతూ ఉండాలి. చివరి దఫా  ఎరువుల మోతాదుతో పాటు కార్భోప్యూరాన్ 3జీ పది కేజీలు లేక కార్భాఫ్ హైడ్రోక్లోరైడ్ 4జీ 8 కేజీల గుళికలు వాడాలి. కనీస ప్రమాద స్థాయిని గమనించిన వెంటనే క్రిమిసంహారక మందులైన ఇంనోఫెన్‌ప్రాజె 2.0 మి.లీ లేదా బూప్రోఫెజిమ్ 2 లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లే దా డైనటోఫ్యూరాన్ 0.5 గ్రాములను లీటరు నీటికి కలిపి దుబ్బు మొదళ్లకు తగిలేలా వృత్తకారంగా పొలం గట్ల నుంచి లోపలికి పిచికారీ చేస్తే దోమపోటు బారి నుంచి వరిపైరును సమర్థవంతంగా నివారించవచ్చు.
 
 నివారణ మార్గాలు
 అగ్గి తెగులు ఆశించిన వెంటనే ఐసోప్రొథియోలేన్ 1.5 మి.లీను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లోనే ఆకు ఎండు తెగులు, వెన్ను తీసిన పొలాల్లో మానిపండు తెగుళ్లు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆకు ఎండు తెగులు బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆకుల అంచుల వద్ద పసుపు రంగు మచ్చలు ఏర్పడి పైనుంచి కిందకు ఎండిపోతాయి. దీనికి ఎటువంటి నివారణ మందులు లేవు. నత్రజని ఎరువులను ఒకే సారి కాకుండా మూడు నుంచి నాలుగు దఫాలుగా వేయాలి.

 తెగులు 5 శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎరువులు వేయడం ఆపాలి. పొలంలో నీటిని తీసివేయాలి. పూతదశలో అండాశయం శిలీంద్రం వల్ల పసుపు పచ్చ ముద్దగా, ఆకుపచ్చ రంగులోకి మారి చివరకు నల్లబడి చిన్న చిన్న ఉండలుగా తయారవుతాయి. కార్బండిజమ్ ఒక గ్రాము లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 2.5 గ్రాములు లేదా ప్రొఫికోనజోల్ ఒక మి.లీ మందును లీటరు నీటికి కలిపి వెన్నులు పైకి వచ్చే దశలో పిచికారీ చేసుకోవాలి.

మరిన్ని వార్తలు