పూతను కాపాడితేనే కాత

18 Nov, 2014 02:59 IST|Sakshi

మంచిర్యాల రూరల్ : మామిడి సాగు చేసిన రైతుకు ముందు చూపు అవసరం. మామిడి తోటల్లో సరైన యాజమాన్యం పాటించి సాగు చేస్తూ, మామిడి పూత, కాత రాలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి దిగుబడి సా ధ్యం. మామిడి సాగులో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే చిట్కాలు, నవంబర్‌లో రైతులు పాటించాల్సిన పద్ధతులను మంచిర్యాల ఉద్యాన శాఖ అధికారి సౌమ్య వివరించారు.

జిల్లాలో 25 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తోడు, చీడపీడలు ఆశించడం వల్ల దిగుబడుల్లో తగ్గుదల, నాణ్యత తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రైతులు అవగాహన లేమితో తమకు తోచిన విధంగా సేద్యం పనులు చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఉద్యాన శాఖ అధికారుల సూచనల మేరకు చేపడితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. నవంబర్‌లో మామిడి రైతులు చేపట్టాల్సిన, పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు ఇవీ.

 చేయాల్సిన పని
 ఈ నెలలో చెట్లకు పూర్తి విశ్రాంతిని ఇవ్వాలి.
 సస్యరక్షణ చర్యలు తప్పితే మరే విధమైన సేద్యపు పనులు చేయరాదు.
 ముఖ్యంగా ఈ నెలలో రైతులు ఎలాంటి కత్తిరింపులు చేపట్టకూడదు. నీటిని కూడా వదలొద్దు.
 ఒక్కోసారి చలి వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు మొగ్గలు ఆలస్యంగా కనిపిస్తాయి. వాటిని ఉత్తేజ పరిచి పూత త్వరగా రావడానికి డిసెంబర్ 15-20 తేదీల మధ్య ఈ కింది పద్ధతులు పాటించాలి.
 నీటి వసతి ఉన్న తోటల్లో తేలికపాటి తడి ఇవ్వడం లేదా లీటరు నీటిలో 10 గ్రాముల పొటాషియం, నైట్రేట్, 5 గ్రాముల యూరియా కలిపి చెట్టుపై పిచికారీ చేయడం వల్ల మొగ్గలు వస్తాయి.
 
 సస్యరక్షణ తప్పనిసరి
 మామిడి పూతకు ముందు, పూత సమయం, కాయ ఎదిగే దశలో అనేక రకాల పురగులు, తెగుళ్లు ఆశించి పంటకు అపార నష్టం కలుగజేస్తాయి. అలాగే సరైన నీటి యాజమాన్యం, పోషకాల యాజమాన్యం సరిగా చేపట్టని తోటల్లో పిందెలు ఎక్కువగా రాలిపోయి, కాయ సైజు తగ్గి నాణ్యత లోపిస్తుంది. దీని నివారణకు కింది జాగ్రత్తలు పాటించాలి.

 బూడిద తెగులు
 లేత ఆకులు, పూత, కాండాలను, పూల మీద, చిరుపిందెల మీద, తెల్లని పౌడరు లాంటి బూజు రాత్రిపూట చల్లని వాతావరణం, పగలు వెచ్చని వాతావరణం ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. దీనివల్ల పూత, పిందెలు రాలిపోతాయి.

 నివారణ
 మొగ్గలు కనిపించే దశలో లీటరు నీటికి 3 గ్రాముల గంధకం(నీటిలో కరిగే) కలిపి పిచికారీ చేయాలి
 పూత దశలో తెగులు కనిపించిన హెక్సాకోన జోల్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా డినోకాప్ లేదా ట్రైడిమార్ఫ్ 1 మిల్లీలీటరు చొప్పున నీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
 
ఆకుపచ్చ/పూతమాడు, నల్లమచ్చ తెగుళ్లు
 వర్షాలు/పొగమంచు అధికంగా ఉన్న సమయంలో ఈ తెగుళ్లు వ్యాపిస్తాయి. ఈ తెగులు లేత ఆకులు, పూలు, పండ్లను ఆశించి నష్టపరుస్తుంది. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా మచ్చలు పోయి ఆకు త్వరగా పండుబారి రాలిపోతాయి. రెమ్మలపైనా నల్లని మచ్చలు ఏర్పడి పూలగుత్తులు, పూలు మాడిపోతాయి. కాయలు రాలిపోతాయి.

 నివారణ
 పూత దశకు ముందే ఎండిన కొమ్మలను కత్తిరించి తగుల బెట్టాలి.
 సూర్యరశ్మి సోకేలా కొమ్మలను జూన్, జూలై మాసంలో కత్తిరింపులు చేసి, లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ లేదా 1 శాతం బోర్డో మిశ్రమం కలిపి పిచికారీ చేయాలి.
 పూతకు ముందే 3 గ్రాముల కాపర్ ఆక్సీ ఫ్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
 పచ్చి పూత మీద ఒక గ్రాము కార్బండిజమ్, ఒక గ్రాము థయోఫినేట్, మిథైల్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
 పిందె దశలో లీటరు నీటిలో 2.5 గ్రాముల మండోజెల్ లేదా రెండు గ్రాముల ఆంట్రాకాల్ కలిపి స్ప్రే చేయాలి.
 
తేనె మంచు పురుగులు
 తల్లి, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు, పూత కాండాలు, పూలు, లేత పిందెల నుంచి రసం పీలుస్తాయి. లేత ఆకులను ఆశించినప్పుడు ఆకుల చివర్లు, అంచులు, పూత మాడిపోతాయి. పిందెలు ఏర్పడవు, ఏర్పడినా బలహీనంగా ఉండి రాలి పోతాయి. అంతేకాకుండా తేనెలాంటి తియ్యటి పదార్థాన్ని విసర్జింజడం వల్ల ఆకులు, కాండాలు, కాయలపై మసి పొర ఏర్పడుతుంది. దీంతో ఆకుల్లో కిరణ జన్య సంయోజన క్రియ జరగక కాయలు చిన్నవై రాలిపోతాయి. పూత, పిందె సమయంలో ఈ పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. మిగతా సమయంలో చెట్ల మొదలు, కొమ్మల బెరడులోని పగుళ్లలో ఉంటాయి. కాయలపై మసి ఏర్పడి, నాణ్యత కోల్పోతాయి.

 నివారణ
 పూత మొగ్గ దశలో : లీటరు నీటికి 1 మిల్లీలీటరు డైక్లోరోఫాస్ లేదా 3 గ్రాముల కార్బోరిల్ కలిపి చెట్టంతా తడిసే విధంగా పిచికారీ చేయాలి.
 పచ్చపూత దశ : పూత కాండలు బయటకు వచ్చి, పూలు వికసించకుండా ఇంకా మొగ్గ దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు మోనోక్రోటోపాస్ లేదా డైమిథోయేట్ లేదా 3 మిల్లీలీటర్లు మిథైల్ డెమటాన్ లేదా 0.25 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ పిచికారీ చేయాలి.
 నల్లపూత దశ : ఈ దశలో పిందెలు బఠాణి గింజ నుంచి చింతగింజ సైజులో ఉంటాయి. లీటరు నీటికి ఒక మిల్లీలీటరు పాస్పోమిడాన్ లేదా 2 మిల్లీలీటర్లు మిథైల్ డెమటాన్ లేదా డైమిథోయేట్ లేదా గ్రాము ఎఫిసేట్ కలిపి పిచికారీ చేయాలి.

 తామర పురుగులు
 ఈ పురుగులు కొత్త చిగురు వచ్చే దశలో ఆకులపై అసంఖ్యాకంగా చేరి, గోకి రసాన్ని పీల్చి వేస్తాయి. దీని వల్ల చిగురు ఆకులు చాలా చిన్నవిగా ఉండి, ఆ తర్వాత రాలిపోతాయి. పిందె ఏర్పడే దశలో కాయపై గోకి బయటకు వచ్చి రసాన్ని పీల్చేస్తాయి. ఈ పురుగు ఆశించిన కాయలపై రాతి మంగు లేదా ఏనుగు మంగు ఏర్పడి కాయ నాణ్యత కోల్పోతుంది. నివారణకు లీటరు నీటికి గ్రాము ఎఫిసేట్ లేదా 1 మిల్లీలీటరు పాసోమిడాన్ లేదా 2 మిల్లీలీటరు రిజెంటును కలిపి పిచికారీ చేయాలి.

మరిన్ని వార్తలు