దుబాయ్‌లో భ‌ర్త‌.. మ‌రో యువ‌కుడి కార‌ణంగా.. వివాహిత తీవ్ర నిర్ణ‌యం!

24 Nov, 2023 08:06 IST|Sakshi
నాగమణి (ఫైల్‌)

బాధితుడి ఇంటి ఎదుట మృతదేహంతో బంధువుల ఆందోళన!

సాక్షి, ఆదిలాబాద్‌: వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకొన్న సంఘటన మండలంలోని పార్‌పెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని పార్‌పెల్లి గ్రామానికి చెందిన ఒడిషెల చిన్న భోజన్న బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లాడు. మూడేళ్లుగా అతడి భార్య నాగమణి(35) ఇద్దరు కుమారులతో కలిసి తల్లిగారింటి వద్ద నిర్మల్‌లోని బెస్తవార్‌పేట్‌లో నివాసం ఉంటోంది. పార్‌పెల్లి గ్రామానికి చిలుక వంశీ అనే వ్యక్తి నాగమణిని కొద్ది రోజులుగా చరవాణిలో లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు.

దీంతో నాగమణి రెండు రోజుల కిందట పార్‌పెల్లి గ్రామానికి చెందిన చిలుక వంశీ తనను ఫోనులో వేధింపులకు పాల్పడుతున్నాడని తల్లితో చెప్పింది. ఇదే క్రమంలో బుధవారం ఉదయం 10గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఇంటికి వచ్చిన తల్లి కళావతికి కుమార్తె ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి కళావతి ఫిర్యాదు మేరకు నిర్మల్‌టౌన్‌లో కేసు నమోదు చేశారు.

పార్‌పెల్లిలో ఆందోళన..
నాగమణి మృతదేహాన్ని పార్‌పెల్లికి అంత్యక్రియల కోసం తీసుకొచ్చారు. ఇదే క్రమంలో వంశీ అనే వ్యక్తి లైంగికంగా వేధింపులకు గురిచేయడంతోనే నాగమణి ఆత్మహత్య చేసుకుందని అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని బంధువులు అతడి ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్‌, సోన్‌ సీఐ నవీన్‌ కుమార్‌ చేరుకుని పార్‌పెల్లిలో గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

భార్య మృతితో ఇంటికి వచ్చిన భర్త..
నాగమణి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిందని విషయం తెలవడంతో భర్త చిన్న భోజన్న దుబాయ్‌ నుంచి గురువారం ఉదయం స్వగ్రామం చేరుకొన్నాడు. దీంతో తన ఇద్దరు కుమారులు శ్రీచరణ్‌(12), శ్రీవర్ధన్‌(10)తో కలిసి భార్య మృతదేహం వద్ద రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. ప్రస్తుతం ఆందోళన కొనసాగిస్తున్నారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు