విన్నారు.. ఆదుకున్నారు..

16 Dec, 2023 05:24 IST|Sakshi

సాయం కోరిన అభాగ్యులకు అండగా నిలిచిన సీఎం వైఎస్‌ జగన్‌

24 గంటల్లో ఎనిమిది మందికి రూ.9 లక్షలు అందజేత

శ్రీకాకుళం పాత బస్టాండ్‌: శ్రీకాకుళం జిల్లా పలాస పర్యటనకు గురు­వారం వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి తన మంచి మనస్సుని చాటుకున్నారు. సాయం కోరి వచ్చిన వారిని అక్కున చేర్చుకుని ఒక్కరోజులోనే ఆయన వారికి ఆర్థిక సాయాన్ని అందించేలా చర్యలు తీసుకున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం నిర్మించిన వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ ఆస్పత్రి, వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రిని పలువురు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.

మందుల కోసం, ఇతర వైద్య అవసరాల కోసం సాయం కోరారు. వారి కష్టాలు విన్న సీఎం వెంటనే సాయం చేయా­లని అక్కడే ఉన్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ శుక్రవారం ఉదయం తన కార్యాలయంలో ఎనిమిది మందికి రూ.9లక్షలు ఆర్థిక సహాయం అందజేశారు.

సాయం అందుకున్న వారి వివరాలు
♦ పొందూరు మండలం నరసాపురం గ్రామానికి చెందిన బోను సంతోషి పదేళ్లుగా తేలికపాటి పక్షవాతం, తీవ్రమైన చర్మవ్యాధితో బాధపడు­తోంది. ఆమె సీఎంను కలిసి ఆర్థిక సాయం కోరడంతో ఆమెకు రూ.2 లక్షలు అందించారు.
♦పెద్ద శ్రీపురం సచివాలయ పరిధికి చెందిన మేరపాటి తులసీదాసు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. సీఎంను కలిసి కష్టం చెప్పుకోగా ఆయనకు రూ.లక్ష అందించారు.
♦సనపల హేమంత్‌కుమార్‌ అనే వ్యక్తి వంశ­పారంపర్య హైపర్‌ కొలోస్ట్రిమియా అనే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యశ్రీలో తనకు చికిత్స అందేలా చూడాలని సీఎంను కోరారు. వెంటనే ఆయనకు రూ.లక్ష చెక్కును కలెక్టర్‌ అందజేశారు.
♦ రాజాం మండలానికి చెందిన అడపా యోగేశ్వరరావు సీఎంను కలిసి తనకు గుండెలో రంధ్రాలు, జన్యుపరమైన సమస్యకు ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స జరిగిందని, ఆర్థిక సాయం చేయాలని కోరారు. దీంతో ఆయనకు రూ.లక్ష మంజూరు చేశారు.
♦ అలాగే.. వితిక (అధిక రక్తస్రావం), సాయికృష్ణ (మానసిక వ్యాధి), ఎం. సాత్విక్‌ (జన్యుపరమైన సమస్యలు), అధిక కొలెస్ట్రాల్‌) కొమర పోలరాజు (ఊపిరితిత్తుల క్యాన్సర్‌ 4వ దశ)లు కూడా ముఖ్యమంత్రిని కలిసి సాయం అభ్యర్థించగా.. వారికి కలెక్టర్‌ ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. 
♦ ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త పి. ప్రకాశరావు, కొవ్వాడ ఎస్‌డీసీ తహసీల్దార్‌ బీవీ రమణ, డి–సెక్షన్‌ సూపరింటెండెంట్‌ పి. అమల, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు