సీఎం జగన్‌తో కేంద్ర బృందం భేటీ

15 Dec, 2023 19:16 IST|Sakshi

సాక్షి, అమరావతి:  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో తుపాను నష్టం, కరువు అంచనాలపై ఏర్పాటు చేసిన కేంద్ర  ప్రభుత్వ అధికారుల బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో సీఎం జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉ‍న్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

ఏపీపై తీవ్ర ప్రభావం చూపిన మిచౌంగ్‌ తుపాను, కరువు పరిస్థితులపై రెండు అధికారుల బృందాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో గుర్తించిన అంశాలను కేంద్ర బృందం చర్చించింది.  తుపాను బాధిత ప్రాంతాల్లో విస్తారంగా పర్యటించిన కేంద్ర అధికారుల బృందం.. తాము చూసిన పరిస్థితులను సీఎం జగన్‌కు వివరించారు. 

ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగారని కేంద్ర అధికారుల బృందం స్పష్టం చేసింది. సచివాలయాల రూపంలో గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉందని ఈ సందర్భంగా కేంద్రం బృందం పేర్కొంది. విపత్తు వచ్చిన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న మార్గాలు మెరుగ్గా ఉన్నాయని సదరు బృందం తెలిపింది. ఏపీలో అమలవుతున్న ఈ- క్రాపింగ్‌ లాంటి విధానం దేశంలో ఎక్కడా లేదని తెలిపిన కేంద్ర బృందం.. ఇవి ఇతర రాష్ట్రాల్లో అనుసరించదగ్గవని, ఆయా ప్రభుత్వాలకు తెలియజేస్తామని పేర్కొంది.  మిచౌంగ్‌ తుపాను కారణంగా జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడ్డ నష్టాలపై సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని వెల్లడించింది. 

తాము పరిశీలించిన అంశాలను  సీఎం జగన్‌కు వివరించిన కేంద్ర బృందం అధికారులు

  • అనంతపురం జిల్లా నుంచి పర్యటన ప్రారంభమై మొత్తంగా ఏడు జిల్లాల్లో తిరిగామని వెల్లడి.
  • మూడు బృందాలుగా జిల్లాల్లో పర్యటించి వర్షాభావ పరిస్థితులపై పరిశీలన చేశామన్న కేంద్ర బృందం.
  • అనంతపురం, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్‌ జిల్లాల్లో పర్యటించామన్న సభ్యులు. 
  • వర్షాభావం కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించామlr, స్థానిక రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నామన్న కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం.
  • వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పశువులు, తాగునీరు తదితర అంశాలపై చర్చ.
  • జలవనరులు పరిస్థితి, రిజర్వాయర్లలో నీటిమట్టాల పరిస్థితిని చూశామని వెల్లడి.
  • అలాగే ఉపాధిహామీ పథకంపైనా పరిశీలన చేశామన్న కేంద్ర బృందం.
  • ఆర్బీకేలు, ఉచిత పంటల భీమా, డీబీటీ పథకాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ,  కంటిజెన్సీ కింద విత్తనాలు పంపిణీ, అమూల్‌ పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా మిల్క్‌ కలెక్షన్‌ సెంటర్ల ఏర్పాటు, గ్రామ సచివాలయాల వ్యవస్థ ఇవన్నీకూడా తాము స్వయంగా చూశామని, ఈ కార్యక్రమాలు చాలా బాగున్నాయని వెల్లడి. 
  • కౌలు రైతులకు కూడా ఎక్కడా లేని విధంగా రైతు భరోసా అందించడం అభినందనీయంగా పేర్కొన్న కేంద్ర బృందం.
  • వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని కేంద్ర బృందం సూచన.
  • పెసలు, మినుములు, మిల్లెట్స్‌ లాంటి ఇతర పంటలవైపు మళ్లేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం సూచన.
  • ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించిన అధికారులు.
  • ఉపాధిహామీ పథకం కింద విస్తారంగా కల్పిస్తున్న పనిదినాలపైనా కేంద్ర బృందానికి వివరాలు తెలిపిన రాష్ట్రాధికారులు.
  • పెండింగులో ఉన్న ఉపాధిహామీ పథకం పనుల బిల్లులను రాష్ట్రానికి వెంటనే వచ్చేలా చూడాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు.
  • తుపాను కారణంగా రంగుమారిన, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్న అధికారులు.
  • ఈ విషయంలో కొన్ని సడలింపులు కావాలంటూ ఇప్పటికే కేంద్రానికి అభ్యర్థించామని, వీలైనంత త్వరగా అవి వచ్చేలా చూడాలని కేంద్ర బృందాన్ని కోరిన అధికారులు.

తుపాను బాధిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలను వివరించిన సీఎం జగన్‌

  • ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించమే కాకుండా వారికి తక్షణ సహాయాలను కూడా అందించామని తెలిపిన సీఎం
  • తుపాను ఏదో ఒక ఒక ప్రాంతంలో సహజంగా తీరం దాటుతుందని, కాని ఈ తుపాను తీరం వెంబడి కదులుతూ కోస్తా ప్రాంతంలో విస్తృతంగా వర్షాలకు కారణమైందన్న సీఎం
  • దీనివల్ల పంటలు దెబ్బతిన్నాయని వెల్లడించిన సీఎం
  • ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ నష్టాన్ని అంచనా వేస్తోందని తెలిపిన అధికారులు
  • తమ రాష్ట్రంలో ఈ- క్రాపింగ్‌ లాంటి సమర్థవంతమైన వ్యవస్థ ఉందని, నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌ కోసం పెడతామన్న సీఎం
  • ఎవరైనా నష్టపోయిన రైతు పేరు లేకుంటే వెంటనే దాన్ని సరిదిద్దేలా అత్యంత పారదర్శకత వ్యవస్థను అమలు చేస్తున్నామన్న సీఎం
  • రైతులను తుదివరకూ ఆదుకునేలా వ్యవస్థలు రాష్ట్రంలో ఉన్నాయన్న సీఎం
  • దీనివల్ల రైతులకు అందించే సహాయం, పరిహారం అత్యంత పారదర్శకంగా రైతులకు చేరుతుందన్న సీఎం
  • క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి స్వయంగా చూసినందున ఆమేరకు రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని కోరిన సీఎం
>
మరిన్ని వార్తలు