ఫోన్‌ కొట్టు.. అవినీతి ఆటకట్టు

13 Oct, 2021 04:45 IST|Sakshi

టోల్‌ఫ్రీ నంబర్‌ 14400కు ఫోన్‌ రాగానే రంగంలోకి దిగిపోతున్న ఏసీబీ

బాధితుల ఫిర్యాదులపై సత్వర స్పందన

రెండేళ్లలో 97 శాతం ఫిర్యాదులు 

నిర్ణీత గడువులోగా పరిష్కారం

సాక్షి, అమరావతి: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడుగా వ్యవహరిస్తోంది. అవినీతికి ఆస్కారం లేని, పారదర్శకమైన వ్యవస్థను రూపొందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రెండేళ్లుగా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. బాధితులు టోల్‌ ఫ్రీ నంబర్‌ 14400కు ఫోన్‌ చేస్తే చాలు క్షణాల్లోనే యాక్షన్‌లోకి దిగిపోతోంది. ఫిర్యాదుల తీరును బట్టి తగిన చర్యలు తీసుకుంటోంది. అవినీతి ఆరోపణలు వాస్తవమని తేలితే కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల అవినీతిపై బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏసీబీ ‘స్పందన’ వ్యవస్థను విజయవంతంగా నిర్వహిస్తోంది.

97 శాతం కేసులు నిర్ణీత వ్యవధిలో పరిష్కారం
బాధితుల ఫిర్యాదులను తక్షణం పరిష్కరించడంపై ఏసీబీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. అందుకోసం విశాఖపట్నంలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నంబర్‌ 14400 కేటాయించింది. బాధితులు ఆ నంబర్‌కు ఫోన్‌ చేస్తే విజయవాడలోని ఏసీబీ ప్రధాన కా ర్యాలయానికి వెంటనే సమాచారమిస్తారు. ఏసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆరోపణల తీరును బట్టి నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరిస్తున్నారు. సాధారణ ఫిర్యాదులైతే 10 రోజులు, లోతుగా దర్యాప్తు చేయాల్సిన ఫిర్యాదులైతే నెల రోజుల్లో పరిష్కరించాలన్నది గడువు. 2019 నవంబర్‌ నుంచి 2021 అక్టోబర్‌ 4 వరకు 97% ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడం విశేషం.

ఇప్పటివరకు 5,155 ఫిర్యాదులు రాగా.. వాటిలో నిర్ణీత గడువులోగా ఏకంగా 5,037 ఫిర్యాదులను ఏసీబీ పరిష్కరించింది. కేవలం 118 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి కూడా ఇంకా గడువు ఉంది. ఏసీబీకి ఫిర్యాదు చేశారని తెలియగానే చాలా వరకు కేసులు పరిష్కారమైపోతున్నాయి. ప్రభుత్వం కఠినంగా ఉండటంతో సంబంధిత అధికారులు, ఉద్యోగులు తక్షణం బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నారు. కాగా, వచ్చిన ఫిర్యాదులను విచారించి అవినీతి ఆరోపణలు వాస్తవమని గుర్తించిన కేసుల్లో తదనుగుణంగా తక్షణం చర్యలు తీసుకుంటోంది. 

అత్యధిక ఫిర్యాదులు రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల పైనే..
రెండేళ్లలో అధికారులు, ఉద్యోగుల అవినీతికి సంబంధించి వచ్చిన ఫిర్యాదుల విషయంలో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో, పంచాయతీరాజ్‌ శాఖ రెండో స్థానంలో ఉన్నాయి. రెవెన్యూ శాఖలో పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు, భూ రికార్డుల్లో తప్పుల సవరణ, సర్టిఫికెట్ల మంజూరు, భూముల సర్వేకు సంబంధించిన అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. పంచాయతీరాజ్‌ శాఖలో సర్టిఫికెట్ల జారీ, రుణాలు/పింఛన్లు/ఇళ్లపట్టాల మంజూరు, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అంశాల్లో ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.  

మరిన్ని వార్తలు