నాణ్యత పాటించని బీఈడీ కాలేజీలపై చర్యలు: సురేష్‌

15 Sep, 2020 15:04 IST|Sakshi

విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించడానికే పరీక్షలు

సాక్షి, తాడేపల్లి: కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మన ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న మెజారిటీ అంశాలు దానిలో ఉన్నాయన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌. మంగళవారం ఆయన సాక్షి టీవీతో మాట్లాడుతూ.. ‘ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించాలని మనం ముందుగానే నిర్ణయం తీసుకున్నాం. కొత్త పాలసీ ప్రకారం ప్రీ ప్రైమరీ అంగన్‌వాడీ విద్యకు, స్కూల్ విద్యకు మధ్యలో ఓ ఏడాది అనుసంధానం చేయాలని నిర్ణయించాం. పీపీ1,  పీపీ2 తో పాటు మరొక ఏడాది పెంచుతున్నాం’ అన్నారు. (చదవండి: స్కూల్స్‌ ఓపెన్‌కు ఏపీ సర్కార్‌ కసరత్తు)

అంతేకాక ‘హై స్కూల్ లెవెల్లో 3, 5, 8 తరగతుల్లోనే పరీక్షలు ఉంటాయి. అవి కేవలం వారి సామర్ధ్యాన్ని పరీక్షించడానికి మాత్రమే.10 తరగతిలో బోర్డు పరీక్షలు యథావిధిగా ఉంటాయి. ఉన్నత విద్య కూడా నైపుణ్యంతో ఉండేలా చర్యలు చేపట్టాం. మన రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులు అన్ని విధాలా సమర్థంగా ఉండేలా తీర్చి దిద్దుతాం’ అని సురేష్‌ స్పష్టం చేశారు. అంతేకాక టీచర్ ఎడ్యుకేషన్‌లో నాణ్యత పాటించని బీఈడీ కళాశాలలపై ఉక్కుపాదం మోపాలని సీఎం జగన్‌ చెప్పారని తెలిపారు. సరైన సదుపాయాలు, టీచింగ్ ఫ్యాకల్టీ లేని కాలేజీలపై చర్యలు ఉంటాయని సురేష్‌ హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు