జూన్‌ 20 తర్వాత ఏపీలో కర్ఫ్యూ సడలింపులు: సీఎం జగన్‌

16 Jun, 2021 17:23 IST|Sakshi

సాక్షి, అమరావతి: జూన్‌ 20 తర్వాత కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈనెల 20 తర్వాత సడలింపులిస్తూ కర్ఫ్యూ కొనసాగుతుందని బుధవారం జరిగిన స్పందన సమీక్షలో తెలిపారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. ఏపీలో మూడున్నర కోట్ల మందిలో 69లక్షల మందికి సింగిల్‌ డోసు ఇచ్చినట్టు వెల్లడించారు.

ఇప్పటివరకు 26,33,351 మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ ఇచ్చామని తెలిపారు. గ్రామాల్లో ఫీవర్‌ సర్వే కొనసాగించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ వైద్య సేవలను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చామని ఆయన గుర్తు చేశారు. 89శాతం మంది కోవిడ్‌ బాధితులు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారని తెలిపారు.

ఆరోగ్యశ్రీ కింద 14 వేల మందికిపైగా కోవిడ్‌ వైద్య సేవలు పొందుతున్నారని సీఎం అన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మొదటిసారి పెనాల్టీ, రెండోసారి ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని అధికారులకు చెప్పారు. థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పిల్లల వైద్యం కోసం మూడు అత్యాధునిక ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయని, విశాఖ, కృష్ణా-గుంటూరు, తిరుపతిలో చిల్డ్రన్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు పిల్లలకు వైద్య సేవలందిస్తాయని ఆయన పేర్కొన్నారు.
(చదవండి: జానకినందన్‌ జయించాడు)

మరిన్ని వార్తలు