‘ఐబీపీఎస్‌’లో ఏపీ ఫస్ట్‌

23 Feb, 2021 08:03 IST|Sakshi

10,000 ఉద్యోగాలు కల్పించిన తొలి రాష్ట్రంగా రికార్డు

బీపీవో స్కీమ్‌ కింద దేశవ్యాప్తంగా 45,792 సీట్లు కేటాయింపు

అందులో రాష్ట్రంలోనే 13,792 సీట్లు 

ఇప్పటివరకు 10,365 మంది స్థానికులకు నేరుగా ఉపాధి

ఏపీ పనితీరును మెచ్చుకున్న ఎస్‌టీపీఐ డీజీ డాక్టర్‌ ఓంకార్‌

సాక్షి, అమరావతి: ఐటీ బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ (బీపీవో) కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రవేశపెట్టిన ఇండియా బీపీవో ప్రమోషన్‌ స్కీమ్‌ (ఐబీపీఎస్‌) కింద అత్యధిక బీపీవో యూనిట్లు రాష్ట్రంలోనే ఏర్పాటయ్యాయి. ఐబీపీఎస్‌ కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 45,792 సీట్లు కేటాయించగా.. అందులో మన రాష్ట్రంలోనే 13,792 సీట్లున్నాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 10,365 మంది స్థానికులకు నేరుగా ఉపాధి లభించిందని, తద్వారా 10,000 మార్కును అందుకున్న తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డులకు ఎక్కిందని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఓంకార్‌ రాయ్‌ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 11 పట్టణాల్లో బీపీవో యూనిట్లు నెలకొల్పడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించామని ఆయన చెప్పారు.

రెండేళ్లలో 45 వేల ఉద్యోగాలు
రాష్ట్రంలో బీపీవో యూనిట్లు ఏర్పాటు చేయడానికి పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని ఎస్‌టీపీఐ విశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎం.పి.దూబే ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి సహకారం అందిస్తుండటంతో ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేయడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. ఐబీపీఎస్‌ కింద ఇప్పటివరకు 10,365 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించగా దీనికి నాలుగు రెట్లు పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ప్రత్యక్షంగా ఉపాధి లభించినవారిలో 90 శాతం మంది స్థానిక యువతే ఉన్నారని పేర్కొన్నారు. ఈ స్కీమ్‌ కింద వచ్చే రెండేళ్లలో ప్రత్యక్షంగా 45 వేల మందికి, పరోక్షంగా మూడు లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

ఐబీపీఎస్‌ అంటే..
గ్రామీణ ప్రాంతాల్లో బీపీవో కేంద్రాలను ఏర్పాటు చేసి.. స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌ శాఖ ఐబీపీఎస్‌ను ప్రవేశపెట్టింది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో కాకుండా చిన్న పట్టణాల్లో ఏర్పాటయ్యే బీపీవో యూనిట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ స్కీమ్‌ కింద ఏర్పాటు చేసే ప్రతి సీటుకు గరిష్టంగా రూ.లక్ష ప్రోత్సాహం లభిస్తుంది. అదే మహిళలకు ఉపాధి కల్పిస్తే 5 శాతం, దివ్యాంగులకైతే మరో 5 శాతం అదనంగా ఆర్థిక ప్రయోజనం కల్పిస్తారు.

చదవండి:
డేటాతో పురోగతికి బాట 
‘పంచాయతీ’ ఫలితం.. బాబుకు భయం

 

మరిన్ని వార్తలు