AP: ప్రభుత్వ నిర్ణయాల్ని ఓ అధికారి శాసించలేరు: హైకోర్టు

2 Feb, 2023 03:49 IST|Sakshi

నంద్యాల వైద్య కాలేజీ ఏర్పాటు కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు 

ప్రభుత్వ విధాన నిర్ణయంపై ఓ శాఖాధిపతి అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు 

భూమి బదలాయింపు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం కాదు 

గతంలోనే వ్యవసాయ వర్సిటీకి ప్రభుత్వం 500 ఎకరాలు కేటాయించింది 

ఇప్పుడు తీసుకున్న 50 ఎకరాలకు బదులుగా మరో చోట 50 ఎకరాలు ఇచ్చింది 

సీజే నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ 

భూ బదలాయింపు వ్యాజ్యాలతో పాటు ఇతర వ్యాజ్యాలు కొట్టివేత 

సాక్షి, అమరావతి: నంద్యాలలో వైద్య కళాశాల ఏర్పా­టుకు సంబంధించిన కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వైద్య కళాశాల ఏర్పాటు నిమిత్తం నంద్యాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రానికి (ఆర్‌ఏఆర్‌ఎస్‌) చెందిన 50 ఎకరాలను ప్రభు­త్వానికి బదలాయించేందుకు వీలుగా వ్యవ­సాయ వర్సిటీ గతేడాది చేసిన తీర్మానాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌­లను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఆ భూము­లను వైద్య కళాశాల కోసం బదలాయించడం ప్రజాప్రయోజనాలకు ఎంతమాత్రం విరుద్ధం కాదని తేల్చిచెప్పింది.

వ్యవ­సాయ పరిశోధనతో ముడిపడి ఉన్న ప్రజాప్రయో­జనాల కంటే వైద్య కళాశాల ఏర్పా­టు­తో ముడిపడి ఉన్న ప్రజా­ప్రయో­జనాలు సర్వో­త్కృç­Ù్టమైనవని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొ­కే­ట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చేసిన వాదనతో హైకోర్టు ఏకీభవించింది. భూమి కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఓ విధాన నిర్ణ­యం తీసుకున్న తరువాత శాఖాధిపతి అభ్యంతరం చెప్పడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వైద్య కళా­శా­ల ఏర్పాటు వంటి ప్రజా­ప్ర­యోజనం నిమిత్తం భూ­మి కేటాయించిన తరువాత ఆ విధాన నిర్ణ­యా­న్ని మార్చుకోవాలని ప్రభు­త్వం కింద పనిచేసే అధి­కా­రి ప్రభుత్వ నిర్ణ­యా­లను శాసించేందుకు అనుమ­తిం­చలేమని స్పష్టం చేసింది. 

వ్యాజ్యాలివీ..
నంద్యాలలో వైద్య కళాశాల ఏర్పాటు కోసం ఇతర భూములేవీ లేకపోవడంతో వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ 50 ఎకరాల భూమిని ప్రభుత్వానికి బదలాయించేందుకు వ్యవసాయ వర్సిటీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని సవా­ల్‌ చేస్తూ కర్నూలుకు చెందిన రైతులు బొజ్జా దశరథరామిరెడ్డి, మరికొందరు హైకోర్టులో వేర్వే­రుగా పిల్‌లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం ‘ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది.

నంద్యాలలో ఎక్కడా వైద్య కళాశాల ఏర్పాటుకు అనువైన భూమి లేకపోవడంతో వ్యవసాయ పరిశోధన కేంద్రం భూమిని తీసుకో­వాల్సి వచ్చింది. వైద్య కళాశాల కోసం ఇప్పుడు తీసుకున్న 50 ఎకరాల భూమిని వ్యవసాయ పరిశోధన కోసం మాత్రమే కేటాయించారన్న పిటిషనర్ల వాదన సరికాదు. 2015లోనే వ్యవసాయ వర్సిటీకి 500 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు వైద్య కళాశాల కోసం తీసుకుంటున్న 50 ఎకరాలకు బదులుగా మరో 50 ఎకరాలను అదనంగా ప్రభు­త్వం కేటాయించింది.

ప్రజలందరికీ తగిన వైద్య సదు­పాయం కల్పించడం సమాజ మౌలిక అవసరం. ప్రతి ప్రభుత్వం కూడా ఇందుకు ప్రాధాన్యత ఇవ్వా­ల్సి ఉంటుంది’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. తాము జోక్యం చేసుకో­వాల్సినంత ప్రజాప్రయో­జనాలు ఈ వ్యాజ్యా­లలో లేవని పేర్కొంది. కాగా, కొత్తగా కలెక్టరేట్‌ కోసం వ్యవసాయ పరిశోధన కేంద్రం భవనాలను వినియో­గించుకోవడంపై దాఖలైన పిల్‌ను సైతం కొట్టేసింది.   

మరిన్ని వార్తలు