ప్రత్యేకంగా కరోనాకు వైద్యం, సంబంధిత సేవల కోసమే
భవిష్యత్లో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధత
ఇప్పటికే 8,439 మంది నియామకం
కొనసాగుతున్న మిగతా పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: కరోనా ఆస్పత్రుల్లో వైద్యం, సంబంధిత సేవల కోసం ప్రత్యేకంగా వైద్య సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతించింది. భవిష్యత్లో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున స్పెషలిస్ట్ డాక్టర్లు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు (జీడీఎంవో), స్టాఫ్ నర్సులు, ట్రైనీ నర్సులు, పారిశుధ్య సిబ్బంది కలిపి మొత్తం 30,887 పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఇప్పటికే 8,439 మందిని నియమించగా మిగతా పోస్టుల భర్తీ కొనసాగుతోంది. ఒకవైపు ఆస్పత్రుల్లో అవసరమైన బెడ్లను ఏర్పాటు చేస్తూనే.. మరోవైపు వైద్య సిబ్బంది నియామకానికి సమాంతరంగా చర్యలు తీసుకుంటోంది. ఈ నియామకాలన్నీ రెగ్యులర్ నియామకాలకు అదనం.