సీఎం జగన్‌ను కలిసిన ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి

10 Mar, 2021 16:51 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : టీటీడీకి సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు కథనాల వెనక చంద్రబాబు హస్తం ఉందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. సొంత లాభం కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడం సరికాదన్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు వార్తలు తనను తీవ్రంగా కలిచివేశాయన్నారు. అందుకే ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా వేశానన్నారు. ఓ కేసు విషయంలో  బుధవారం ఏపీకి వచ్చిన ఆయన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆయనను సాదరంగా ఆహ్వానించి, శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఇరువురి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది.

భేటీ అనంతరం ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ లావాదేవీలను కాగ్‌ ద్వారా ఆడిట్‌ చేయించేందుకు సీఎం జగన్‌ అంగీకరించారని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో మంచి సంబంధాలు ఉండేవని గుర్తు చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సీఎం జగన్‌ చర్చలు జరుపుతారని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రధానికి సీఎం జగన్ రెండు సార్లు లేఖ రాశారని గుర్తుచేశారు. అఖిల పక్షం, కార్మిక నేతలతో కలుస్తానని సీఎం చెప్పారన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తాను విభేదిస్తున్నానని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు