ఏపీ: టెన్త్‌ పరీక్షలకు సర్వం సిద్దం.. ఆర్టీసీలో విద్యార్థులకు ఫ్రీ ప్రయాణం

1 Apr, 2023 11:59 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీలో సోమవారం(ఏప్రిల్‌ 3) నుంచి టెన్త్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు 18వ తేదీ వరకు జరుగనున్నాయి. కాగా, పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టెన్త్‌ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ఏపీ టెన్త్ పరీక్షలు 2023 మోడల్ పేపర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ఇక, మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. టెన్త్‌ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాము. రాష్ట్రంలో 6.69 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్ష సమయం ఉంటుందన్నారు. ఆరు సబ్జెక్ట్‌లకు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదు. ప్రభుత్వ టీచర్లు మాత్రమే ఇన్విజిలేటర్లుగా ఉంటారు. పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినట్టు వెల్లడించారు. 

పరీక్షా కేంద్రాల వద్ద నో మొబైల్ జోన్‌గా ప్రకటించాం. సెల్ ఫోన్, స్మార్ట్ పరికరాలు మొదలైనవి ఇన్విజలేటర్లు కూడా తీసుకురాకూడదు. పరీక్షలు జరిగే రోజున పరీక్షా కేంద్రాల పరిధిలోని ఆయా పాఠశాలలకి సెలవు ఉంటుంది. పరీక్షల నిర్వహణకి 800 స్క్వాడ్‌లు ఏర్పాటు చేశాం. ఇక, వేసవి కాలం ఎండ నేపథ్యంలో ఈనెల 3వ తేదీ నుంచి ఏపీలో ఒంటిపూట బడులు నడుస్తాయని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలు సైతం మూడో తేదీ నుంచి ఒంటి పూటే బడులు నిర్వహించాలి అని తెలిపారు. 

మరిన్ని వార్తలు