గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే.. ఆ రైతులకు ఎకరానికి రూ.9.20లక్షలు

3 Nov, 2022 10:54 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప(చాపాడు): గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.9.20లక్షల నష్టపరిహారాన్ని కేంద్రం ఇవ్వనున్నట్లు తహసీల్దారు సుభాని తెలిపారు. మండలంలోని సిద్దారెడ్డిపల్లె పంచాయతీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం పిచ్చపాడు రెవెన్యూ పొలాల పరిధిలోని రైతులతో తహసీల్దారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం భూములు సేకరిస్తోందన్నారు.

భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.9.20లక్షల నష్ట పరిహారం చెల్లించేందుకు నిర్ణయించిందన్నారు. రైతులకు అభ్యంతరాలుంటే రాత పూర్వకంగా తెలియజేయాలన్నారు. రైతులు భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం రెవెన్యూ సిబ్బందికి అందించాలన్నారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ఐ ప్రవీణ్, వీఆర్‌ఓ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు