టిడ్కో ఇళ్ల పరిశీలన అంటూ టీడీపీ ప్రకటన.. మచిలీపట్నం పర్యటనకు చంద్రబాబు వెనుకడుగు

12 Apr, 2023 09:27 IST|Sakshi

అయితే ఇప్పటికే టిడ్కో గృహాల నిర్మాణాన్ని పూర్తి చేసిన ప్రభుత్వం 

మరికొద్ది రోజుల్లో లబ్ధిదారులకు పంపిణీకి ఏర్పాట్లు

ప్రజల చేతిలో భంగపాటు తప్పదని పర్యటన రద్దు చేసుకున్న బాబు

మచిలీపట్నం టౌన్‌: కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం పర్యటనను ప్రతిపక్ష నేత చంద్రబాబు రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఈ నెల 12న బుధవారం సాయంత్రం మచిలీపట్నంలో రోడ్‌ షో, బహిరంగ సభ నిర్వహిస్తామని టీడీపీ నేతలు ప్రకటించారు. రోడ్‌ షోలో భాగంగా చింతగుంటపాలెం గో సంఘం వద్ద ఉన్న జీ+3 టిడ్కో గృహాలను చంద్రబాబు పరిశీలిస్తారని తెలిపారు.

అయితే రాష్ట్ర ప్రభు­త్వం ఇప్పటికే అక్కడ జీ+3 గృహాలు, మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేసింది. స్థానిక టీడీపీ నేతలు ఈ గృహ సముదాయాల పనులను పరిశీలించారు. దీంతో చంద్రబాబును ఇక్కడకు తీసుకువస్తే ప్రజల చేతిలో భంగపాటు తప్పదని అంచ­నాకు వచ్చారు. నిర్మాణాలు పూర్తవడంతో చంద్ర­బా­బు పరువుపోవడం ఖాయమని భావించిన టీడీపీ నేతలు ఆయన పర్యటనను రద్దు చేయించారు.
 
నాడు: చంద్రబాబు హయాంలో 2019 నాటికి రుద్రవరంలోని జీ+3 గృహాల నిర్మాణ పరిస్థితి ఇది

చంద్రబాబు హయాంలో అసంపూర్తిగా గృహాలు 
నగరంలోని గోసంఘం, రుద్రవరం ప్రాంతాల్లో జీ+3 గృహాల నిర్మాణం పనులకు చంద్రబాబు ప్రభుత్వం హయాంలో శ్రీకారం చుట్టారు. గోసంఘంలో 18 బ్లాక్‌ల్లో 864 గృహాలు నిర్మించాల్సి ఉండగా 14 బ్లాక్‌లను మాత్రమే నిర్మించారు. నాలుగు బ్లాక్‌ల పనులు చేపట్టనేలేదు. ఈ గృహాల్లో ఫ్లోరింగ్, కరెంటు, నీటి సదుపాయం తదితర మౌలిక వసతుల పనులు ప్రారంభించలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిపోయిన నాలుగు బ్లాక్‌లను నిరి్మంచి, అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసింది. గృహాల నిర్మాణ పనులకు రూ.53.93 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.13.15 కోట్లు వెచ్చించింది. మరికొద్ది రోజుల్లోనే ఈ గృహాలను లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

నేడు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రుద్రవరంలో నిర్మించిన జీ+3 గృహాలు, ముమ్మరంగా సాగుతున్న రహదారి పనులు   

రుద్రవరంలోనూ అంతే.. 
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రుద్రవరంలో 30 బ్లాక్‌ల్లో 1,440 గృహాలు నిర్మించాల్సి ఉండగా కేవలం రెండు బ్లాక్‌ల జీ+2 పనులు మాత్రమే చేశారు. 28 బ్లాక్‌లకు సంబంధించి ఫుట్టింగ్‌ లెవల్‌ వరకు మాత్రమే పనులు చేపట్టి అలాగే వదిలేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ 30 బ్లాకులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతం అన్ని బ్లాక్‌ల్లో జీ+3 గృహాలను నిర్మించింది.

మచిలీపట్నంలోని గో సంఘం వద్ద పంపిణీకి సిద్ధంగా ఉన్న జీ+3 గృహాలు  

బ్లాక్‌ల మధ్య రహదారుల నిర్మాణం, వ్యర్థాలకు సంబంధించిన సివిలేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గో సంఘం, రుద్రవరంల్లో జీ+3 గృహాలకు తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇందుకు మచిలీపట్నంలోని వాటర్‌ వర్క్స్‌ వద్ద నుంచి పైప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. దీని ద్వారా జీ+3 గృహాలకు తాగునీరు సరఫరా కానుంది. రెండు చోట్లా తాగునీటిని నిల్వ చేసే సంపులను కూడా నిర్మించారు. గృహాల వద్ద ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు.
చదవండి: ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

పంపిణీకి సిద్ధం చేశాం..
గో సంఘం వద్ద జీ+3 గృహాల నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేసి పంపి­ణీకి సిద్ధం చేశాం. రుద్రవరంలో అన్ని బ్లాక్‌ల నిర్మాణం పూర్తయింది. గృహాల్లోని మెట్లు, బాత్‌రూమ్‌ల పనులు జరుగుతున్నాయి. అలాగే సిమెంటు రోడ్లు, డ్రెయిన్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంటర్నల్‌ పైప్‌లైన్ల నిర్మాణం పూర్తి చేశాం. 
– ఎం.గణేష్‌బాబు, ఏఈ  

మరిన్ని వార్తలు