ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్‌

9 Dec, 2022 19:54 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పలు రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్‌ గవర్నర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. భారత్‌లో జరగనున్న G-20 సదస్సు సన్నాహకాలపై ఈ సందర్భంగా చర్చించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ హాజరయ్యారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రెవెన్యూ శాఖ (ఎక్సైజ్, వాణిజ్య పన్నులు) స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు, ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి నారాయణ భరత్‌ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా జరగబోతున్న సదస్సుల్లో ఏపీకి కేంద్రం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ఫిబ్రవరి, ఏప్రిల్‌లో మూడు సదస్సులను ఏపీలో నిర్వహించాలనే యోచనలో ప్రధాని ఉన్నారు. జీ-20 సదస్సు సన్నాహకాలకు విశాఖపట్నం వేదిక కానుంది. 

కాగా, జీ–20 అధ్యక్ష దేశంగా భారత్‌ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో.. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి వచ్చే ఏడాది నవంబర్‌ వరకు సదస్సులు, వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోని 56 నగరాలు, పట్టణాల్లో వివిధ అంశాలకు సంబంధించి 200 సదస్సులు నిర్వహించబోతోంది. ఏపీ నుంచి విశాఖపట్నాన్ని కేంద్రం ఎంపిక చేసింది

చదవండి: (Visakhapatnam: విశాఖ వేదికగా జీ–20 సదస్సు)

మరిన్ని వార్తలు