జగనన్నకు చెబుదాం.. 

4 Feb, 2023 04:32 IST|Sakshi

సంతృప్త స్థాయిలో ప్రజా వినతుల పరిష్కారమే లక్ష్యంగా కొత్త కార్యక్రమం 

‘స్పందన’లో అత్యధిక అర్జీలు అందుకుంటున్న విభాగాధిపతులతో సీఎం సమీక్ష 

ప్రతి వినతి పరిష్కారం అయ్యే వరకూ ట్రాకింగ్‌  

అందిన అర్జీలపై ప్రతి వారం ఆడిట్, నివేదికలు 

ట్రాకింగ్, పర్యవేక్షణపై ప్రతివారం సమీక్ష  

కాల్‌ సెంటర్ల అనుసంధానం, ఇప్పటికే ఉన్న పద్ధతులు బలోపేతం  

పోలీసులకు వచ్చే అర్జీలపై మండల స్థాయిలో సమన్వయ కమిటీ 

ఈ మెకానిజం అంతా సిద్ధం కాగానే అమలుకు శ్రీకారం 

సాక్షి, అమరావతి: ప్రజా వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఇందుకు అధికారులంతా సన్నద్ధం కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం సన్నాహకాల్లో భాగంగా స్పందన కార్యక్రమంలో అత్యధిక అర్జీలు అందుకుంటున్న ప్రభుత్వ విభాగ అధిపతులతో శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ విభాగాధిపతి ప్రతి వినతి పరిష్కారం అయ్యేంత వరకూ ట్రాక్‌ చేయాలని చెప్పారు.

‘అందిన అర్జీలపై ప్రతి వారం ఆడిట్‌ చేయడంతో పాటు నివేదికలు తీసుకోవాలి. ట్రాకింగ్, పర్యవేక్షణ జరుగుతుందా? లేదా? అన్న దానిపై ప్రతివారం సమీక్ష చేయాలి’ అని అన్నారు. సీఎంఓతో పాటు ప్రతి ప్రభుత్వ శాఖలో ‘జగనన్నకు చెబుదాం’ ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ విభాగాలు ఉండాలని చెప్పారు. తర్వాత జిల్లా, మండల స్థాయిలో, మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల స్థాయిలో కూడా ఈ విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. మానిటరింగ్‌ యూనిట్లు సమర్థవంతంగా పనిచేస్తేనే ఈ కార్యక్రమం మంచి ఫలితాలిస్తుందని తెలిపారు. ఈ మెకానిజం అంతా సిద్ధం కాగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

సహనం, ఓపిక, పునఃపరిశీలన  
►సంబంధిత విభాగంలో సరిగ్గా పని జరగలేదనే కారణంతోనే వినతులు, ఫిర్యాదులు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో వారిని సంతృప్తి పరిచేలా పరిష్కారం చూపడం అన్నది సవాల్‌తో కూడు­కున్నది. సహనం, ఓపిక, పునఃపరిశీలన, విధా­నాల పునరి్నర్మాణాలతో ముందుకు సాగాలి. 
►స్పందన డేటా ప్రకారం అత్యధికంగా ఫిర్యా­దులు రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, హోంశాఖ, ఆరోగ్యం–కుటుంబ సంక్షేమ శాఖల నుంచి వస్తున్నాయి. జగనన్నకు చెబుదాం ప్రా­రం­భమయ్యాక కూడా ఇవే విభాగాల నుంచి వినతులు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నా­యి. అందువల్ల ఈ శాఖలకు చెందిన విభాగాధిపతు­లు అర్జీల పరిష్కారంపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. 

 సిబ్బందికి ఓరియంటేషన్‌  
►జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై సిబ్బందికి ఓరియెంటేషన్‌ ఇవ్వాలి. మానిటరింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై కూడా మార్గదర్శకాలు రూపొందించాలి. నిర్దేశిత సమయంలోగా వినతులు పరిష్కారం కావాలి. ఆ సమయంలోగా పరిష్కారం కావడం, పరిష్కారంలో నాణ్యత ఉండడం అన్నది చాలా ముఖ్యం. సమస్య పరిష్కారం అయ్యాక వినతులిచ్చిన వారి నుంచి లేఖ తీసుకోవాలి. 

►ఏదైనా అర్జీని తిరస్కరించాల్సిన నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. తిరస్కరణకు గురైనా, జరిగిన ప్రక్రియపై అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేసేలా ఉండాలి. అవినీతికి సంబంధించిన అంశాలను చాలా గట్టిగా తీసుకోవాలి. తప్పు చేయడానికి భయపడే పరిస్థితి ఉండాలి. 

►పోలీసులకు వచ్చే అర్జీల పరిష్కారానికి మండల స్థాయిలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలి. పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్‌ అధికారులతో కూడిన మండల, మున్సిపల్‌ స్థాయి సమన్వయ కమిటీ వారంలో ఒక రోజు సమావేశమై అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వ విభాగాధిపతులు త్వరలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించి.. వారికి అవగాహన కల్పించాలి. 

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా, మున్సిపల్‌ అడ్మిని్రస్టేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్, సెర్ప్‌ సీఈఓ ఏఎండీ ఇంతియాజ్, ఇతర ఉన్నతాధికారులు 
హాజరయ్యారు.   

మరిన్ని వార్తలు