సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీశైలం పర్యటన రద్దు

22 Aug, 2020 03:44 IST|Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శ్రీశైలం పర్యటనను రద్దు చేసుకున్నట్టుగా సీఎంఓ అధికారులు వెల్లడించారు. వరుసగా రెండో ఏడాది శ్రీశైలంలోకి వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు శుక్రవారం సీఎం శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. అయితే, శ్రీశైలం ప్రాజెక్టుకు సంబం«ధించి తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం విషయాన్ని సీఎంఓ అ«ధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

జలవిద్యుత్‌ కేంద్రంలో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో అక్కడకు వెళ్లి పూజలు, సమీక్ష సమావేశం నిర్వహించడం సబబుకాదని సీఎం అధికారులతో అన్నారు. తెలంగాణ విద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిక్కుకుపోయిన వారు సురక్షితంగా బయట పడాలని ఆకాంక్షించారు. అక్కడి అధికారులు ఎలాంటి సహాయం కోరినా వెంటనే అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం పర్యటనను రద్దు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో  సీఎం శ్రీశైలం పర్యటనను రద్దు చేస్తున్నట్టుగా సీఎంఓ అధికారులు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు