గృహ నిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్ష.. వనరులపై దృష్టిసారించాలని ఆదేశం

11 Jul, 2022 13:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గృహ నిర్మాణాలకు వనరుల విషయంలో దృష్టిసారించాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏపీలో గృహనిర్మాణశాఖపై తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఇవాళ(సోమవారం) సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా..  జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై సీఎం జగన్‌ ఆరా తీశారు.

ఈ సందర్భంగా అధికారులు.. ఇంకా  ఎక్కడైనా అవసరాలు ఉంటే దానికి అనుగుణంగా పనులు, నిధులు మంజూరుచేసి పని పూర్తిచేస్తున్నామని అధికారులు బదులిచ్చారు. అంతేకాదు గత సమీక్ష సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు.. ఇంకా అవసరమైన చోట ల్యాండ్‌ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోడౌన్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేస్తున్నామని తెలిపిన అధికారులు. ఆప్షన్‌ –3లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. 

ఆప్షన్‌ –3 కింద ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి నిర్దేశించుకున్న ఎస్‌ఓపీని పాటించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్‌. అంతేకాదు..  ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వనరులన్నీ కాలనీల్లో ఉన్నాయా? లేదా?  ఇటుకల తయారీ యూనిట్లను కాలనీలకు సమీపంలోనే పెట్టుకున్నారా? లేదా? తదితర వనరుల విషయంలో పరిశీలనలు చేయాలని తెలిపారు.

అలాగే గోడౌన్లు తదితర కనీస అవసరాలను సమకూర్చుకుని..  ఇళ్లనిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా కోర్టు కేసుల వివాదాల్లోని ఇళ్లపట్టాలపై స్పష్టత కోసం ప్రయత్నించాలని, ఆగస్టు మొదటివారంలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధంకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంకా.. 

జగనన్న కాలనీల్లో డ్రెయిన్లు సహా కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి:
డ్రైనేజీ, కరెంటు, నీటి సరఫరా అంశాలపై దృష్టిపెట్టాలి.
ఇళ్లలో పెట్టే ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్‌లైట్లు నాణ్యతతో ఉండాలి.
జగనన్న కాలనీల రూపంలో కొన్నిచోట్ల ఏకంగా మున్సిపాల్టీలే తయారవుతున్నాయి. అలాంటి చోట్ల మౌలిక సదుపాయాల కల్పన, పౌరసేవలు తదితర అంశాలపై ప్రత్యేక ప్రణాళిక ఉండాలి. 
నిర్మాణ నాణ్యతపై అధికారులు ప్రతి దశలోనూ దృష్టిపెట్టాలి:

90 రోజుల్లో పట్టాలు పంపిణీపై కూడా సీఎం సమీక్ష 
లబ్ధిదారునికి కేవలం ఎక్కడ ఇంటి స్థలం ఇచ్చిందీ చూపడమే కాదు, పట్టా, దానికి సంబంధించిన డాక్యుమెంట్ల అన్నీకూడా ఇవ్వాలి. స్థలం ఇచ్చారని, దానికి సంబంధించిన పట్టా, డాక్యుమెంట్లు కూడా ఇచ్చారని లబ్ధిదారుల నుంచి ధృవీకరణ తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, సీఎస్‌ సమీర్‌ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌ ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


చదవండి: సీఎం జగన్‌ స్పీచ్‌ ప్రారంభం కాగానే..

మరిన్ని వార్తలు