తిరుపతి రుయా ఘటన తీవ్రంగా కలచివేసింది: సీఎం జగన్‌

11 May, 2021 13:25 IST|Sakshi

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం

ఆక్సిజన్‌ విషయంలో కలెక్టర్లందరూ అప్రమత్తతతో వ్యవహరించాలి

స్పందనపై కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

కరోనా కట్టడి చర్యలపై కలెక్టర్లకు సీఎం జగన్‌ దిశానిర్దేశం

సాక్షి, అమరావతి: స్పందనలో భాగంగా జిల్లా కలెక్టర్లతో తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. కోవిడ్, ఉపాధి హామీ పనులు, వైఎస్సార్‌ జలకళ, వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్, హౌసింగ్, స్పందనకు వచ్చిన వినతులు, ఖరీఫ్‌కు సన్నద్ధతపై సీఎం సమీక్షించారు.

కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. బాధాకరమైన ఘటనలు కూడా జరుగుతున్నాయని.. నిన్న రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన తీవ్రంగా కలచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం ప్రకటించారు. మనం ఎంత కష్టపడుతున్నా, ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేని అంశాలకు కూడా మనం బాధ్యత వహించాల్సి వస్తోందన్నారు.

‘‘తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ సరైన సమయానికి రాలేకపోయినందున, ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందని.. 11 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. ఆక్సిజన్‌ పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే నిన్నకూడా ఆరు ట్యాంకర్లను గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి ఒడిశాకు విమానంలో పంపాం. రవాణా సమయాన్ని ఆదా చేయడానికి ఎయిర్‌ లిఫ్ట్‌ చేశాం. అక్కడ నింపి... రోడ్డు మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. విదేశాల్లో కూడా ఆక్సిజన్‌ కొనుగోలు చేసి షిప్స్‌ ద్వారా తెప్పిస్తున్నాం. ఇన్నిరకాలుగా ఆక్సిజన్‌ కొరత రాకుండా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న కూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేకపోవడంవల్ల నష్టాలు జరుగుతున్నాయి. కలెక్టర్లందరికీ కూడా చెప్తున్నా... చాలా అప్రమత్తతతో వ్యవహరించాలి. ఇంకా మానవత్వం చూపించాల్సిన అవసరం ఉంది. కోవిడ్‌ కారణంగా నెలకొన్న సమస్యలను మానవత్వంతో ఎదుర్కోవాల్సి ఉందని’’ సీఎం అన్నారు.

‘‘18 ఏళ్లకు పైబడ్డ వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడానికి 172 కోట్ల డోసులు దేశానికి అవసరమైతే ఇప్పటి వరకూ కేవలం 17 కోట్లు డోసులు మాత్రమే ఉత్పత్తి అయిన పరిస్థితి కనిపిస్తోంది. 45 సంవత్సరాలు పైచిలుకు ఉన్నవారు రాష్ట్రంలో 1.48 కోట్ల మంది ఉన్నారు. వీరికి 2 డోసులు చొప్పున దాదాపు 3 కోట్లు డోసులు ఇవ్వాలి. 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారు రాష్ట్రంలో 2 కోట్ల మంది జనాభా సుమారుగా ఉన్నారు. వీరికి దాదాపు 4 కోట్ల డోసులు అవసరం. అంటే 18 ఏళ్ల పైబడి రాష్ట్రంలో ఉన్నవారికి వ్యాక్సిన్లు ఇవ్వాలంటే దాదాపు 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ 73 లక్షల డోసులు మాత్రమే కేంద్రం నుంచి మనకు అందాయి. ఈ పరిస్థితి ఉందని అందరికీ తెలుసు.

డబ్బులు తీసుకుని మాకు సప్లైచేయండని కోరినా సరే కంపెనీలు తీసుకోవడం లేదు. వ్యాక్సిన్ల పంపిణీ అన్నది కేంద్రం నియంత్రణలో ఉంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం కూడా అఫిడవిట్‌లో దాఖలు చేసింది. జనాభా ప్రాతిపదికన కోటాను నిర్దారిస్తామని అఫిడవిట్‌లో పేర్కొంది. ఇలాంటి పరిస్థితి ఉండి కూడా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి వాళ్లు చేస్తున్న ప్రచారాలు ఒక్కసారి చూడండి. వ్యాక్సిన్లకు కేవలం రూ.45 కోట్లు మాత్రమే ఇచ్చారు. రూ.1600 కోట్లు ఇవ్వలేరా? కమీషన్లు కోసం చూస్తున్నారు? అని ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షం మాట్లాడుతున్న ఈ మాటలను పతాక శీర్షికల్లో ఈనాడు లాంటివి వేస్తున్నాయి. ప్రజల్లో అలజడిని రేకెత్తించడానికి, భయాందోళనలు సృష్టించడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని’’ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘టియర్‌ –1 సిటీస్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు లేకపోయినా దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య సేవలు అదించగలుగుతున్నాం. మరణాల రేటు పరిశీలిస్తే చాలా రాష్ట్రాలతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉన్నాం. కలెక్టర్ల స్థాయి నుంచి ఆశా వర్కర్, వాలంటీర్‌ స్థాయి వరకూ ఎంతో కమిట్‌మెంట్‌గా చిత్త శుద్ధితో పనిచేస్తున్నాం. అయినా సరే కొన్ని కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. అయినా సరే.. మరింత సమర్థవంతంగా, మానవత్వంగా, సానుభూతి చూపించి పనిచేద్దాం. జీర్ణించుకోలేని పరిస్థితుల్లో కొందరు రాజకీయ నాయకులు, ఎల్లోమీడియా ఉంది.

మన తప్పు కాకపోయినా, పక్కరాష్ట్రం నుంచి రావాల్సిన ట్యాంకర్‌ సకాలానికి రాకపోయినా సరే ... బాధ్యత తీసుకుని నిన్నటి రుయా ఘటనలో మరణించిన కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్నాం. వారి కుటుంబాల దగ్గరకు వెళ్లి పరిహారం ఇవ్వండి, వారి బాసటగా ఉండండి. తప్పులు మళ్లీ జరక్కుండా... భవిష్యత్తులో, ఇంకా ఎలా చేయగలుగుతాం అన్నదానిపై దృష్టిపెట్టాలి. తప్పును ఒప్పుకోవడం అన్నది చిన్నతనం కాదు. కోవిడ్‌ విషయంలో మనం అత్యంత పారదర్శకంగా ప్రతి అడుగులోనూ వ్యవహరించాం. ఈ 22 నెలల కాలంలోనే ఒక్క బటన్‌ నొక్కితే ఎలాంటి అవినీతికి, వివక్షకు తావులేకుండా రూ. 87వేల కోట్ల రూపాయలు పేదలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల ద్వారానే ఇవ్వగలిగాం. ఇలాంటి ప్రభుత్వం వ్యాక్సిన్లకు రూ.1600 కోట్లు ఖర్చు చేయడానికి వెనకాడుతుందా?’’ అని సీఎం అన్నారు.

సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
104 వ్యవస్థను ప్రతి ఒక్కరూ ఓన్‌చేసుకోవాలి
104కు అనుసంధానంగా ప్రతి జిల్లా స్థాయిలో కూడా వ్యవస్థ ఉండాలి
104కు కాల్‌చేస్తే రెస్పాన్స్‌ లేదనే మాట రాకూడదు 
సంబంధిత జేసీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగాలి
104కు కాల్‌చేస్తే మంచి సేవలు అందుతున్నాయనే ప్రజలు భావించాలి
మందులు ఇవ్వడం, క్వారంటైన్‌ సెంటర్లో చేర్పించడం, ఆస్పత్రుల్లో బెడ్‌లు ఇవ్వడం ఇవన్నీకూడా మన బాధ్యత
మొదటసారి దేశంలో ఆరోగ్యశ్రీ కింద కోవిడ్‌ చికిత్సను పూర్తి ఉచితంగా ఇస్తున్నాం:
104కు కాల్‌చేస్తే ఉచితంగా వైద్యం అందించే రాష్ట్రాల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది:
104 ద్వారా 16 నుంచి 17వేల కాల్స్‌ వస్తున్నాయి
కాల్స్‌ రిసీవ్‌చేసుకునే కెపాసిటీని కూడా పెంచాం
దీనికి అనుగుణంగా జిల్లాల్లో అనుసంధాన వ్యవస్థల్లో వనరులను పెంచుకోవాల్సి ఉంటుంది
మన ఇంట్లో మనకు కావాల్సిన వ్యక్తి ఫోన్‌ చేస్తే ఎలాంటి స్పందన ఆశిస్తామో... అలాంటి స్పందనే యంత్రాంగం నుంచి ఉండాలి
టెస్టింగ్, మెడికల్‌ కన్సల్టేషన్, ట్రాన్స్‌పోర్టేషన్‌.. .ఇవన్నీకూడా అందుబాటులోకి వచ్చేలా చూడాలి
3 గంటల్లోకి వారికి సేవలందించే బాధ్యతలను తీసుకోవాలి
ఏపీలో 648 ఆస్పత్రులను ఎంపానెల్‌ చేశాం
47,947 బెడ్లను అందుబాటులోకి తీసుకు వచ్చాం, 41,315 బెడ్లు భర్తీలో ఉన్నాయి
ఆస్పత్రి ఆవరణ లో టెంపరరీ జర్మన్‌ హాంగర్స్‌ను ఏర్పాటు చేయాలి
దీని వల్ల ఆస్పత్రిలో వేచిచూసే పరిస్థితులు ఉండవు, డాక్టర్లు కూడా వెంటనే వచ్చి వైద్యం చేసే అవకాశం ఉంటుంది:
దీంతో పాటు కోవిడ్‌ కేర్‌ సెంటర్లపై దృష్టిపెట్టాలని కోరుతున్నాం
కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో కూడా ఆక్సిజన్‌ సప్లై అవసరమైనంత మేరకు ఏర్పాటుచేసే ఆలోచనలు అధికారులు చేయాలి
ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్ల కొనుగోలుపై దృష్టిపెట్టింది. త్వరలోనే ఇవి అందుబాటులోకి వస్తాయి
ఆస్పత్రుల్లో ఉండే ఆక్సిజన్‌ పైపులైన్లను పర్యవేక్షణ చేయండి
టెక్నికల్‌ స్టాఫ్‌ను కచ్చితంగా నియమించండి
నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సరైన ఒత్తిడితో ఆక్సిజన్‌ వెళ్లేలా చేయాలి
అలాగే ఐసీయూలోకూడా ప్రెజర్‌ బూస్టర్స్‌కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలన చేయండి
కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలనుంచి మనకు ఆక్సిజన్‌ వస్తోంది
మూడు రాష్ట్రాలకు ముగ్గురు అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపిస్తున్నాం
ఆక్సిజన్‌ సప్లై పెంచడానికి వీరు దృష్టిపెడతారు
తమిళనాడుకు కరికాలవలవన్, కర్ణాటకకు అనంతరాములు, ఒడిశాకు పరీడాలను పంపిస్తున్నాం
రేపటి నుంచి ఈ వ్యవస్థ పనిచేస్తుంది
అలాగే జిల్లాల్లో ఆక్సిజన్‌వార్‌ రూమ్స్‌  ఏర్పాటు చేయాలి:
ఎస్‌ఓఎస్‌ ... ఎమర్జెన్సీ మెసేజ్‌ రాగానే వెంటనే చర్యలు తీసుకోవాలి
ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వెంటనే తెలియజేయాలి
కలెక్టర్లు జాగ్రత్తగా పర్యవేక్షణ చేయగలిగితే.. సమర్థవంతంగా ముందుకు సాగే అకాశం ఉంటుంది
అలాగే జిల్లాల్లో స్టోరేజీ కెపాసిటీలు కూడా ఎక్కడైనా ఉన్నాయా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలి
ఎక్కడైనా పరిశ్రమలు ఉన్నాయా? వాటికి సదుపాయాలు ఉన్నాయా? అన్నదానిపై దృష్టిపెట్టాలి
ఇప్పటికే నేవీ బృందాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వెళ్తున్నాయి
ఈ సమయంలో వారు చాలా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు
నేవీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను
నేవీ బృందాల సేవలను బాగా వినియోగించుకోండి
కోవిడ్‌ వైద్యం కోసం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులను కూడా తీసుకున్నాం
మంచి ఆహారం అందుతున్నాయా? లేవా? పారిశుద్ధ్యం బాగుందా? లేదా? మందులు సక్రమంగా అందుతున్నాయా? రెమిడెసివర్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయా? లేవా?అలాగే సిబ్బంది తగినంత సంఖ్యలో ఉన్నారా? లేదా? చూడండి
ఈ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా ఆరోగ్య మిత్ర ఉండేలా చూసుకోండి
సమస్యలు ఏమైనా ఉంటే ఫిర్యాదు చేయడానికి నంబర్‌ను ఉంచండి
అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోకూడా 50శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అందుబాటులో ఉంచాలని కోరాం. దీన్ని కూడా పర్యవేక్షణ చేయాలి
ఇక్కడకూడా అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేవా? చూడాలి
వారికి కావాల్సిన మందులు, ఆక్సిజన్‌ తదితర వాటి సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలి
ప్రతి 2–3 ఆస్పత్రులకు ఒక నోడల్‌ ఆఫీసర్‌ కచ్చితంగా ఉండాలి
648 ఆస్పతులకూ కచ్చితంగా నోడల్‌ అధికారులను నియమించాలి
ఆరోగ్య శ్రీ, ఆక్సిజన్‌ సప్లై, ఆస్పత్రుల పనితీరు, శానిటేషన్, ఫుడ్‌క్వాలిటీ దీనిమీద నోడల్‌ అధికారులు దృష్టిపెట్టాలి. మనకు నివేదికలు కూడా అందిస్తారు
ఫ్లయింగ్‌ స్కాడ్‌లు నిరంతరం తనిఖీలు చేపట్టాలి
వైద్యులను కూడా వెంటనే నియమించాలి
దీని కోసం వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలను వెంటనే నిర్వహించండి
మనం కర్ఫ్యూ కూడా విధించాం
అదే సమయంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి
భౌతిక దూరం పాటించాలి, మాస్కులు వేసుకోవాలి
12 గంటలు దాటిన తర్వాత మినహాయింపులు ఉన్నవారు తప్ప మిగిలిన వారు కచ్చితంగా కర్ఫ్యూ పాటించాలి
12 గంటలు దాటిన తర్వాత నూటికి నూరుశాతం కర్ఫ్యూ పాటించాలి
వ్యాక్సినేషన్‌కు సంబంధించిన దుష్ప్రచారాన్నికూడా ప్రతి సందర్భంలోకూడా తప్పికొట్టాలి
ప్రజలను రెచ్చగొట్టి, వారి భావోద్వేగాలతో ఆడుకుంటూ... ప్రజలు వాక్సినేషన్‌ వద్ద గుమిగూడే పరిస్థితిని సృష్టిస్తున్నారు
అందరికీ ఉచితంగా టీకా అందుతుంది
వ్యాక్సిన్ల కొరత ఉంది కాబట్టి, కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన కేటాయింపులు ప్రకారం వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతుంది కాబట్టి, మీ వంతు వచ్చేంతవరకూ ఓపిగ్గా ఉండాలని ప్రజలకు చెప్పాలి
45 ఏళ్లకు పైబడి రెండో డోసు ఇవ్వాల్సిన అవసరం ఉంది
33లక్షలకుపైగా వీరు ఉన్నారు.. వీరికి మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది
లేకపోతే మొదటి డోసు వేసుకున్నా ప్రయోజనం ఉండదు
వీళ్లకి మొదటి వేశాక, 45 ఏళ్ల పైబడి ఉన్నవారు ఇంకా ఎవరైనా ఉంటే వారికీ కంప్లీట్‌ చేస్తాం
వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం కూడా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తోంది
► వచ్చే సరఫరాను బట్టి.. ప్రజలకు ప్రాధాన్యత క్రమంలో అందిస్తామనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి

చదవండి: తిరుపతి రుయా ఆస్పత్రిలో అదనపు ఆక్సిజన్‌ ప్లాంట్‌
ఏపీలో కరోనా నిబంధనలు మరింత కఠినతరం

మరిన్ని వార్తలు