కుట్రపూరితంగానే ఎమ్మెల్యే తలారిపై దాడి

4 May, 2022 04:36 IST|Sakshi
దాడికి ముందు ఘటనా స్థలంలో గుంపుగా ఉన్న టీడీపీ వర్గీయులు

దాడి వెనుక టీడీపీ నాయకులు 

సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌

ద్వారకా తిరుమల: ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో గత నెల 30న ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై జరిగిన దాడి కుట్రపూరితమేనని తేలింది. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో అల్లర్లు రేపేందుకు, ఎమ్మెల్యేను, వైఎస్సార్‌సీపీని అప్రతిష్టపాల్జేసేందుకు టీడీపీ వర్గీయులే ఈ దాడి చేసినట్లు ఫొటోలు, వీడియోలతో సహా బయటపడింది. ప్రస్తుతం ఈ సాక్ష్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాలు.. వైఎస్సార్‌సీపీ జి.కొత్తపల్లి గ్రామ అధ్యక్షుడు గంజి నాగప్రసాద్‌ గత నెల 30న హత్యకు గురయ్యాడు. హత్య విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఆ తర్వాత కొంత సేపటికి అక్కడికి చేరుకున్న టీడీపీ వర్గీయులు.. గ్రూపు రాజకీయాల వల్లే ఈ హత్య జరిగిందంటూ ఎమ్మెల్యే పైకి గ్రామస్తుల్ని ఉసిగొల్పే ప్రయత్నం చేశారు. చివరకు టీడీపీ నేతలు, కార్యకర్తలే స్వయంగా రంగంలోకి దిగి ఎమ్మెల్యేతో పాటు పోలీసులపై దాడి చేశారు. ఈ దాడికి ముందు టీడీపీ వర్గీయులు ఘటనా స్థలానికి కూతవేటు దూరంలో ఉన్న ఒక తోటలో మద్యం సేవించి, దాడికి కుట్ర పన్నినట్లు సమాచారం. ఇదిలాఉండగా.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోమవారం ద్వారకా తిరుమలలో మీడియా సమావేశం నిర్వహించి.. ఎమ్మెల్యేపై దాడితో తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. దాడిలో తమ పార్టీకి చెందిన ఏ ఒక్కరైనా పాల్గొన్నట్లు చూపించగలరా అని సవాల్‌ విసిరారు. 

మరిన్ని వార్తలు