సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం 

20 Jun, 2022 07:37 IST|Sakshi

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): డీఎస్సీ–98 క్వాలిఫైడ్‌ అభ్యర్థులు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతతెలిపారు. నగరంలోని పోలీస్‌ కంట్రోల్‌ రూం వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహం వద్ద సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. పలువురు మాట్లాడుతూ 24 ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తమ ఆకాంక్షను సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేర్చారని సంతోషం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి డీఎస్సీ–98 అభ్యర్థుల ఫైల్‌పై సంతకం చేశారన్నారు. సీఎం జగన్‌కు తాము జీవిత కాలం రుణపడి ఉంటామని ఉద్వేగంతో చెప్పారు. కార్యక్రమంలో క్వాలిఫైడ్‌ అభ్యర్థులు అగిరిపల్లి శ్రీనివాస్, జె.సీతారామిరెడ్డి, రంగాచార్యులు, కోటేశ్వరరావు, అనురాధ, దాక్షాయనిరెడ్డి, సాయిరాం ప్రసాద్‌ పాల్గొన్నారు. 
 
పెట్రోల్‌ బంక్‌ నుంచి ఉద్యోగానికి..
గుడివాడ టౌన్‌: తనకు ఉద్యోగం ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సదా రుణపడి ఉంటానని క్వాలిఫైడ్‌ ఉపాధ్యాయుడు బండి కుమార్‌బాబు చెప్పారు. కృష్ణాజిల్లా నందివాడ మండలం జనార్దనపురం పెట్రోల్‌ బంకులో పని చేసుకుంటూ బతుకుబండి లాగిన తాను.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా మారానని సంతోషం వ్యక్తంచేశారు. 

మరిన్ని వార్తలు