Fact Check: అప్పులపై తప్పుడు కథనం

15 Oct, 2023 04:16 IST|Sakshi

అప్పులపై ఈనాడు రామోజీ దిగజారుడు రాతలు 

ఐదు నెలల్లోనే ఏడాది అప్పు అంటూ గగ్గోలు 

బాబు హయాంలో 2018–19లో బడ్జెట్‌ అనుమతికి మించి అదనంగా రూ.9,546 కోట్లు అప్పు 

బడ్జెట్‌లో పెట్టిన దానికంటే 139 శాతం అదనం 

ఈనాడు రామోజీకి ఇది కనిపించలేదు 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తెచ్చిన అప్పు 72.28 శాతమే

ఇదే నేరమైనట్లు చిత్రీకరిస్తూ ఈనాడులో కథనం 

సాక్షి, అమరావతి: ‘తప్పులెన్ను వాడు తన తప్పులెరుగడు’ అన్నది గతం. ఈనాడు రామోజీరావు విషయంలో ‘ఒప్పులన్నింటినీ తప్పులనే వాడు తన తప్పులెరుగడు’ అంటూ అన్వయించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అహరహం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తూనే అభివృద్ధికీ బాటలు వేస్తున్నారు. అందులో భాగంగా కొంతమేర అప్పులూ తెస్తున్నారు. ఈ అప్పులపై ఈనాడులో తప్పుడు రాతలు రాస్తూ.. రామోజీ గత ప్రభుత్వాలు తెచ్చిన అప్పులను, వాటిని అవి ఏ విధంగా పక్కదారి పట్టించాయన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు.

ఏడాదిలో చేయాల్సిన అప్పులు ఐదు నెలల్లోనే అంటూ ఓ దిగజారుడు కథనాన్ని ఈనాడులో అచ్చేశారు. ఇదే రామోజీకి గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే చివరి ఏడాది చేసిన భారీ అప్పులు, వాటిని పక్కదారి పట్టించిన వైనం కనిపించలేదు. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు చేయాల్సిన అప్పు కూడా చంద్రబాబే చేశారని కాగ్‌ గణాంకాలు స్పష్టంగా చెప్పినా రామోజీ చూడనట్లే ఉన్నారు. ఎందుకంటే అప్పుడు ఆయన ఇష్టుడైన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు సీఎంగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

ఎప్పుడూ చంద్రబాబే సీఎంగా ఉండాలనే కాంక్ష బలీయంగా ఉన్న రామోజీకి ఆ సీట్లో వైఎస్‌ జగన్‌ ఉండటం ససేమిరా ఓర్చుకోలేరు. అందుకే అవే కాగ్‌ గణాంకాల్లో కేపిటల్‌ వ్యయం, సామాజిక రంగ వ్యయం ఉన్నా సరే వాటిని మరుగున పరిచేసి కేవలం అప్పులపైనే కథనం అల్లారు. అదేదో మహా తప్పిదమైనట్లు రోత రాతలు రాశారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిబంధనలకు లోబడి, కేంద్ర అనుమతుల మేరకే అప్పులు చేసినప్పటికీ ఈ రుణాలపై రామోజీ పదే పదే విష ప్రచారానికి దిగుతున్నారు. 

గత చంద్రబాబు ప్రభుత్వం 2018–19 బడ్జెట్‌లో రూ24,205 కోట్లు అప్పు చేస్తామని చెప్పి ఏకంగా రూ.34,751 కోట్లు అప్పు చేసింది. అంటే బడ్జెట్‌లో చెప్పిన దానికన్నా రూ.9,546 కోట్లు ఎక్కువగా (139 శాతం అదనంగా) అప్పు చేసినట్లు కాగ్‌ గణాంకాలే తెలిపాయి. ఇది తప్పు అని రామోజీకి అనిపించలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో చెప్పిన అప్పుల్లో ఆగస్టు నెలాఖరు వరకు 72.28 శాతమే అప్పు చేసింది. అదీ నిబంధనల మేరకే. అంతే కాదు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేవలం ఐదు నెలల్లోనే  సామాజిక రంగంపై ఏకంగా రూ.68,012 కోట్లు వ్యయం చేసినట్లు కాగ్‌ స్పష్టంగా లెక్కగట్టి చెప్పింది.

గత చంద్రబాబు ప్రభుత్వం సహా దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వమూ సామాజిక రంగంపై ఇంతగా ఎప్పుడూ ఖర్చు చేయలేదని కాగ్‌ తేటతెల్లం చేసింది. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, తాగునీటి రంగాలపై చేసే ఖర్చు. ప్రజలకు అత్యంత అవసరమైన రంగాలివి. ప్రజా సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఉన్న దృఢ సంకల్పానికి నిదర్శనమిది. మరో పక్క బడ్జెట్‌లో కేపిటల్‌ వ్యయానికి చేసిన కేటాయింపుల్లో కేవలం ఐదు నెలల్లోనే.. అంటే ఆగస్టు వరకు 40.79 శాతం ఖర్చు చేసి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని కాగ్‌ వెల్లడించింది. ప్రజా సంక్షేమాన్ని, కేపిటల్‌ వ్యయాన్ని వక్రీకరిస్తూ తప్పుడు సమాచారం ఇచ్చే స్థాయికి ఈనాడు రామోజీ దిగజారారు. 

బాబు తెచ్చిన అప్పులు బండెడు 
చంద్రబాబు దిగిపోయే ఆర్థిక సంవత్సరంలో తరువాతి ప్రభుత్వానికి కూడా అప్పు పుట్టనంతగా ముందుగానే రుణాలు తెచ్చేసినా రామోజీ ఒక ముక్క కూడా రాయలేదు. చంద్రబాబు ప్రభుత్వం అదనంగా చేసిన అప్పులను  తరువాతి సంవత్సరాల్లో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అప్పుల నుంచి తగ్గిస్తామని కేంద్రం హెచ్చరించినా రామోజీకి తప్పనిపించలేదు. కేవలం వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నారని, ఆయన ప్రజా సంక్షేమానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారన్న దుగ్ధే రామోజీలో కనిపిస్తోంది.  

మరిన్ని వార్తలు