FactCheck: రామోజీ శోకం రుషి‘కొండంత’!

22 Nov, 2023 05:40 IST|Sakshi

రుషికొండ ప్రాజెక్టుపై మరోసారి కడుపుమంట బయటపెట్టుకున్న ఈనాడు 

విశాఖను రాజధానిగా చేస్తుంటే తట్టుకోలేని రామోజీ 

సీఎంను విశాఖకు రాకుండా అడ్డుకునే కుట్ర 

అందుకే విలాసాలు, దుబారా అంటూ కొండంత విషం 

అత్యాధునిక పర్యాటక సౌకర్యాలతో రుషికొండ ప్రాజెక్టు చేపట్టిన ఏపీటీడీసీ 

పాత భవనాలు ఆధునికతకు పనికిరావని కొత్తవి నిర్మాణం 

సీఎం క్యాంపు కార్యాలయం కోసం ప్రత్యేక కమిటీ వేసిన ప్రభుత్వం 

అనేక భవనాలను పరిశీలించి రుషికొండ ప్రాజెక్టు సిఫారసు 

ప్రజలకు, వీవీఐపీలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉండవని కమిటీ వెల్లడి 

గతంలో చంద్రబాబు క్యాంపు కార్యాలయాలకు భారీగా ప్రజాధనం వృథా 

బాబు ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో బసకే రోజుకు రూ.లక్ష ఖర్చు 

సొంత ఇళ్లకు, క్యాంపు కార్యాలయాలకు బాబు రూ. కోట్లు ఖర్చు 

ఇలాంటి దుబారా బాబు.. చాలా నిరాడంబరుడు 

సొంత ఇంటినే క్యాంపు కార్యాలయంగా చేసుకున్న సీఎం జగన్‌ది దుబారానా? 

సాక్షి, అమరావతి: అభివృద్ధి చూసి గోల పెట్టడమంటే ఇదే. మంచిని గుర్తించలేని కడుపు మంట అంటే ఇదే. ఒకళ్లపై పడి ఏడవటమంటే ఇదే. ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన విశాఖలో ఓ మంచి ప్రాజెక్టు రావడం రామోజీకి ఇష్టమే ఉండదు. విశాఖను రాజధానిగా చేస్తుంటే తట్టుకోలేరు. విశాఖ సుందర తీరంలో ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేలా ఓ అద్భుత ప్రాజెక్టు ని ర్మిస్తుంటే అసలే తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఉత్తరాంధ్రపై ఆయనకు ఉన్న ఉన్మాదాన్ని మరోసారి ప్రదర్శించారు.

రుషికొండ టూరిజం ప్రాజెక్టుపై కొండంత విషం చిమ్మారు. హైదరాబాద్, విజయవాడలో క్యాంపు కార్యాలయాల పేరిట, ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో బసకు ఆయన అనుంగు చంద్రబాబు చేసిన కోట్లాది రూపాయల దుబారాను వదిలేసి, ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన టూరిజం ప్రాజెక్టుపై విలాసాలు, దుబారా అంటూ చిందులేస్తున్నారు. రుషికొండ ప్రాజెక్టులో ఆధునిక సౌకర్యాలు కల్పించారని, ఇందుకోసం ప్రజాధనం రూ.433 కోట్లు ఖర్చు చేశారంటూ శోకాలు తీస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విశాఖ రాకుండా కుట్ర చేస్తున్నారు. 

ఆదాయం కోసమే కొత్త రిసార్టు ప్రతిపాదన 
వాస్తవానికి రుషికొండపై 1984–89లో 48 వేల చదరపు అడుగులు స్థలంలో నిర్మాణాలు చేశారు. తర్వాత 2002లో మరిన్ని నిర్మాణాలు చేపట్టారు. పర్యాటక రంగానికి తలమానికంగా ఉండాల్సిన  ఈ భవనాల్లో తగినన్ని వసతులు లేవు. వాటిని ఆధునికంగా తీర్చిదిద్దడం సాధ్యం కాదని అధికారులు తేల్చారు. పైగా ఈ భవనాలు పాతబడటంతో వాటి స్థానంలో కొత్తవి ని ర్మించాలని నిర్ణయించారు. అందుకే ఏపీటీడీసీ 2.15 లక్షల చదరపు అడుగుల్లో కొత్తగా రిసార్ట్‌ నిర్మాణం చేపట్టింది.

గతంలో చదరపు అడుగు స్థలంలో ఏడాదికి వచ్చే ఆదాయం రూ.1,100 అయితే, దానిని రూ.2,300కు పెంచేలా కొత్త రిసార్టులను డిజైన్‌ చేశారు. అందుకే బీచ్‌ ముఖద్వారంగా అన్ని రకాల సదుపాయాలతో నిర్మాణాలు చేసింది. ఈ నిర్మాణాలకు సీఆర్‌జెడ్, ఏపీసీజెడ్‌ఎంఏ, అటవీ, ఫైర్‌సేఫ్టీ, బిల్డింగ్‌ ప్లాన్‌ అప్రూవల్, ఏపీపీసీబీల నుంచి ముందస్తు అనుమతులు తీసుకునే పనులు చేస్తున్నారు. త్వరలో మొత్తం పనులు పూర్తికానున్నాయి.  

బాబుగారి క్యాంపు ఆఫీసుల బాగోతమిదీ.. 
చంద్రబాబు తొలుత జూబ్లిహిల్స్‌లోని తన నివాసాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించి దానిలో హంగులు, ఆర్భాటాల కోసం ఖజానా నుంచి నిధులు ఖర్చు చేశారు. ఆ తరువాత అద్దె ఇంటిలోకి వెళ్లి ఆ ఇంటిని సీఎం నివాసం, క్యాంపు కార్యాలయంగా ప్రకటించారు. ఆ ఇంటికి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు వృథాగా ఖర్చు చేశారు. తొలుత హైదరాబద్‌లోని సెక్రటేరియట్‌లో హెచ్‌ బ్లాక్‌ను సీఎం కార్యాలయంగా ప్రకటించి రూ. 7 కోట్లతో మరమ్మతులు చేశారు. ఆ తరువాత వాస్తు పేరుతో ఎల్‌ బ్లాక్‌ను సీఎం కార్యాలయంగా ప్రకటించి అక్కడ మరమ్మతులు, ఫర్నిచర్, హంగుల కోసం ఏకంగా రూ.25 కోట్లు ఖర్చు చేశారు.

హైదరాబాద్‌లోనే లేక్‌వ్యూ గెస్ట్‌ హౌన్‌ను సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించి రూ.10 కోట్లు ఖర్చు చేశారు. ఆ తరువాత ఓటుకు కోట్లు కేసులో ఆయన గుట్టు రట్టవడంతో హఠాత్తుగా హైదరాబాద్‌ వదిలేసి రాత్రికిరాత్రి విజయవాడ వచ్చేశారు. విజయవాడ ఇరిగేషన్‌ గెస్ట్‌ హౌస్‌ను సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించి రూ.42 కోట్లతో మార్పులు చేశారు. చివరికి కృష్ణా కరకట్ట ఎక్కి లింగమనేని గెస్ట్‌ హౌస్‌ను సీఎం నివాసం, క్యాంపు కార్యాలయంగా ప్రకటించారు. ఇవన్నీ కూడా అధికారికంగా జీవోల ద్వారానే  ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు దుబారా చేసినవే.

 హైదరాబాద్‌ మదీనాగూడలోని చంద్రబాబు సొంత  ఫామ్‌ హౌస్‌లో హెలిప్యాడ్, రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు. మదీనాగూడతో పాటు జూబ్లిహిల్స్‌లో  విలాసవంతమైన ఇంద్రభవనాలు ని ర్మించుకున్న చంద్రబాబు.. వాటిలో ఇంటీరీయర్‌ కోసం సీఆర్‌డీఏ నిధులను మళ్లించారు. ఇలాంటి దుబారా బాబు.. రామోజీ దృష్టిలో చాలా నిరాడంబరుడు. తన సొంత ఇంటినే క్యాంపు కార్యాలయంగా చేసుకున్న సీఎం జగన్‌ను మాత్రం ఏ కారణం లేకుండా తప్పుపట్టేయొచ్చు.  

ఇందుకే రుషికొండ ఎంపిక.. 
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై  సమీక్షల కోసం ముఖ్యమంత్రి విశాఖలో విడిది చేయడానికి అనువైన భవనాలను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. విశాఖలోని ఐటీ హిల్స్‌తో పాటు అనేక భవనాలను పరిశీలించింది. ఆంధ్ర యూనివర్శిటీ ప్లాటినం జూబ్లీహాల్స్, వీఆర్‌ఎండీఏ బిల్డింగు, వీఎంఆర్డీఏ పిఠాపురం షాపింగ్‌ కాంప్లెక్స్, రుషికొండ వద్ద ట్రైబల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, మిలీనియం టవర్స్, రుషికొండపై ని ర్మించిన రిసార్టులను తుది పరిశీలనలోకి తీసుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయం, అధికారులతో సమావేశాలు, భద్రత దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది లేకుండా భవనం ఎంపిక చేయాలని భావించారు.

రుషికొండ రిసార్టు, ట్రైబల్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ భవనం మినహా మిగిలినవన్నీ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఉన్నాయి. అధికారులకు, ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందుల్లేకుండా ఉండేలా అనేక కోణాల్లో చర్చించిన తర్వాత రుషికొండ రిసార్టును సీఎం క్యాంపు కార్యాలయానికి అనువైనదని సూచించారు. పైగా దీనికి సమీపంలోనే గత ప్రభుత్వంలో ని ర్మించిన హెలిప్యాడ్‌ ఉంది. ఇది సీఎం సహా వీవీఐపీల రాకపోకలకు అనుకూలంగా ఉంటుందని కమిటీ నివేదికలో పేర్కొంది.

రుషికొండ ప్రాజెక్టు సీఎం క్యాంపు కార్యాలయంగా పరిశీలనలోకి రావడం, సీఎం భద్రత దృష్ట్యా చిన్న చిన్న మార్పులను కమిటీ సూచించింది. అంతకు ముందు రుషికొండ ఒక పర్యాటక ప్రాజెక్టు మాత్రమే. దేశ, విదేశీ పర్యాటకులకు అత్యాధుని పర్యాటక అనుభూతిని అందించే ఉద్దేశంతోనే ఏపీటీడీసీ ఈ ప్రాజెక్టును చేపట్టినందనేది జగమెరిగిన సత్యం. కానీ, ఈనాడు మాత్రం వాస్తవాలను వక్రీకరిస్తూ విశాఖకు సీఎం రాకూడదనే ఉద్దేశంతో నిత్యం బురదజల్లుతూనే ఉంది. 

ఫైవ్‌స్టార్‌ బాబు గుర్తులేడా రామోజీ! 
చంద్రబాబు ఎన్ని క్యాంపు కార్యాలయాల కోసం ఖజానా నుంచి ఎన్ని కోట్లు వెచ్చించారో రామోజీ ఓసారి ఐదేళ్లు వెనక్కు వెళ్లి పరిశీలన చేసుకోవాలి. ఐదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా సీఎం నివాసం క్యాంపు కార్యాలయాల కోసం కోట్ల రూపాయలను వ్యయం చేసి దుబారాకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తన నివాసం, క్యాంపు కార్యాలయంగా హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను ప్రకటించి మరీ సర్కారు ఖజానా నుంచి ఏకంగా రూ.30 కోట్లు చెల్లించారు.

ఫైవ్‌ స్టార్‌ హోటల్లో బాబు కుటుంబం నెలల తరబడి నివాసం ఉండటం, అందుకు ఖజానా నుంచి కోట్ల రూపాయలు చెల్లించినా రామోజీ రావుకు కనపించలేదు. ఏ ముఖ్యమంత్రీ ఎప్పుడు ఇలా ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో నివాసం ఉండలేదు. పార్క్‌ హయత్‌ హోటల్‌కు రోజుకు లక్ష రూపాయల చొప్పున అద్దె చెల్లించినట్లు అప్పట్లోనే ఆంగ్ల పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. 

మరిన్ని వార్తలు