అర్ధసత్యాల ఆంధ్రజ్యోతి

23 Jun, 2022 08:15 IST|Sakshi

ఆదోని రూరల్‌: అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆంధ్రజ్యోతి లబ్ధిదారుల్ని తప్పుదారిపట్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. వారితో ఏదో ఒకటి ఆవేశంగా మాట్లాడించి అక్కడేదో గందరగోళం జరిగిందన్నట్లు రాసి ప్రజల్ని మభ్యపెడుతోంది. కులమతాలు చూడం.. పార్టీలు చూడం.. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తాం.. అని చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత పారదర్శకంగా ఈ పథకాలను అమలు చేస్తున్నారు. దీన్ని తట్టుకోలేని పచ్చమీడియా ఏదో ఒక వంక పెట్టాలనే ప్రయత్నిస్తోంది. కర్నూలు జిల్లాలో ఆంధ్రజ్యోతి చేసిన ఇటువంటి ప్రయత్నమే వికటించింది. ఆవేశంగా మాట్లాడినవారు వెంటనే తప్పు తెలుసుకుని ఆ పత్రిక తమను తప్పుదారి పట్టించిందని ఆవేదన చెందుతున్నారు.  


ఢణాపురం సుశీలమ్మ గతంలో విడో పింఛన్‌ పొందినట్లు నివేదికను తయారు చేసి పంపిన దృశ్యం  

ఏం జరిగిందంటే..  
కర్నూలు జిల్లా ఆదోని రూరల్‌ మండలం ఢణాపురం గ్రామంలో సోమవారం ఎంపీడీవో గీతావాణి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన సుశీలమ్మ అనే మహిళ తనకు పెన్షన్‌ రావడంలేదని, బియ్యం కార్డు తీసేశారని, అమ్మఒడి కూడా పడడంలేదని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చింది. అదే గ్రామానికి చెందిన రైతు వెంకోబా కుమారుడు వీరేష్‌ తమకు రూ.40,500 రైతుభరోసా నిధులు పడలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. వీటిని మాత్రమే ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు.

వారు ఎమ్మెల్యేను నిలదీసిన తరువాత అధికారులు వారికి వాస్తవాలు ఏమిటో ఆధారాలతో చూపించారు. పదెకరాల భూమి ఉండటంతో విడో పింఛను, రేషన్‌ కార్డు తొలగించినట్లు.. అందుకే అమ్మ ఒడి పడలేదని సుశీలమ్మకు అధికారులు తెలిపారు. పంటల బీమా మూడేళ్లలో రూ.13,500 వంతున మొత్తం రూ.40,500 బ్యాంకు ఖాతాలో పడినట్లు చూపించడంతో రైతు వీరేష్, ఆయన తండ్రి వెంకోబా అంగీకరించారు. వీటిని మాత్రం ఈ పచ్చమీడియా విస్మరించడం చూస్తుంటే పనిగట్టుకుని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని ఇట్టే తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు