దివీస్ ల్యాబ్ వద్ద ఉద్రిక్త వాతావరణం

17 Dec, 2020 18:29 IST|Sakshi

సాక్షి, తొండంగి: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం సంపాదిపేట దివీస్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఉదయం ఆకస్మికంగా వెయ్యిమంది ఉద్యమకారులు దివీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిర్మాణం వైపు దూసుకువెళ్లారు. 

ఉద్యమకారులు ఫ్యాక్టరీ అక్కడ ఉన్నజనరేటర్‌ను తగులబెట్టి  గోడలను కూల్చేశారు. ఒక్కసారిగా వందల మంది ఉద్యమకారులు లోపలకు చొచ్చుకు రావడంతో అక్కడ  ఏమి జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఉద్యమం పెల్లుబికింది. వందల మంది ఉద్యమకారులను పోలీసులు నిర్బంధించారు. దీంతో సుమారుగా ఎనిమిది  వందలు మంది దివీస్ గేటు వద్ద , బైఠాయించి, లోపల నిర్బంధించిన తమ వాళ్లను వదలకపోతే కదిలేది లేదంటూ బైఠాయించారు. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. కాగా దివీస్ ల్యాబరేటరీస్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానిక రైతులు, వామపక్షలు గత కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నాయి. పరిశ్రమ మెయిన్ గేట్ ఎదురుగా నిరసన శిబిరం ఏర్పాటు చేసి తమ నిరసన తెలుపుతున్నారు. కాలుష్యకారక పరిశ్రమ నిర్మాణం చేపట్టవద్దంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడ 144 సెక్షన్ అమలులో ఉంది.

మరిన్ని వార్తలు