పేదలకు ఇకపై ఉచిత ప్రతివాద న్యాయసేవలు

21 Nov, 2020 04:37 IST|Sakshi
ఆన్‌లైన్‌ ప్రారంభోత్సవంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌కుమార్, జస్టిస్‌ రఘునందన్‌ రావు, తదితరులు

అనంతపురం లీగల్‌: పేద, బడుగు వర్గాలపై నమోదైన క్రిమినల్‌ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు న్యాయవాదుల నియామకానికి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ శ్రీకారం చుట్టిందని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ చెప్పారు. పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద అనంతపురం జిల్లాకు మంజూరైన న్యాయ సహాయ ప్రతివాద న్యాయవాది వ్యవస్థను జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ శుక్రవారం డిజిటల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెషన్స్‌ కేసుల్లో పేదవారి తరఫున అండగా నిలిచి న్యాయసహాయం అందించటానికి ఈ వ్యవస్థ చక్కటి అవకాశమన్నారు.

జిల్లా పరిపాలనా న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు మాట్లాడుతూ.. సకాలంలో సరైన న్యాయ సహాయకులు లేక ఎందరో జైళ్లలో మగ్గిపోతున్నారని, వారందరికీ అండగా లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ సిస్టం నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్‌ సెక్రటరీ చిన్నంశెట్టి రాజు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి గరికపాటి దీనబాబు, జాతీయ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు రావిురెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.గురుప్రసాద్, అన్ని జిల్లాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు, సీనియర్‌ సివిల్‌ జడ్జిలు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు