దుర్గమ్మ ఆలయంలో ‘గుడికో గోమాత’ కార్యక్రమం ప్రారంభం

7 Dec, 2020 09:54 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ‘గుడికో గోమాత’ కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి హిందూ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి వెల్లంపల్లి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ,టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, జేఈవో బసంత్ కుమార్, రమణ దీక్షితులు, దుర్గ గుడి ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్ బాబు, ఎమ్మెల్యే జోగి రమేష్, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘గుడికో గో మాత’ కార్యక్రమం ప్రారంభించాలని టీటీడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. గోవును పూజిస్తే తల్లిని పూజించినట్టే. అన్ని దేవాలయాలకు  గోవులను అందజేస్తాం. భక్తులు కూడా  టీటీడీకి గోవులను ఇవ్వటానికి ముందుకు రావాలి. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలకు గోవులను అందిస్తాము. భక్తులు గో దానము కొరకు టీటీడీని సంప్రదించండి. గోవుల సంరక్షణ విషయంలో ఆలయ అధికారులు పూర్తి బాధ్యత వహిస్తారు’ అని తెలిపారు. (చదవండి: ‘పూజాదికాల’పై కోర్టులెలా నిర్ణయిస్తాయి?)

దాతలు ముందుకు వచ్చి గోవులను అందజేయాలి
మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరు గోవులను పెంచాలనే ముఖ్య ఉద్దేశ్యం తో ఈ కార్యక్రమం ప్రారంభించాం. దాతలు కూడా ముందుకు వచ్చి టీటీడీ, హిందు ప్రచార పరిషత్‌కి గోవులు అందజేయాలి’ అని కోరారు
 

మరిన్ని వార్తలు