Manchu Manoj: సోదర బంధం గొప్పది.. కానీ ఈగో ఉండొద్దు.. ఎవరో ఒకరు తగ్గాలి..

25 Nov, 2023 12:33 IST|Sakshi

అన్నాతమ్ముళ్ల మధ్య ఎన్నో గొడవలు జరుగుతాయి. కోపావేశాలు తగ్గగానే తిరిగి కలిసిపోతారు. అది సర్వసాధారణం. అయితే కొందరు మాత్రం ఎప్పుడూ ఎడమొహం పెడమొహంగానే ఉంటారు. మంచు ఫ్యామిలీలోనూ విష్ణు, మనోజ్‌లకు ఒకరంటే ఒకరికి పడటం లేదని వార్తలు వచ్చాయి. వీటిని రుజువు చేస్తూ మనోజ్‌ పెళ్లికి సైతం అతిథిగా వచ్చి వెళ్లిపోయాడు విష్ణు.

మంచు ఫ్యామిలీలో గొడవలు
ఆ మధ్య వీరు గొడవపడిన వీడియో సైతం నెట్టింట వైరల్‌ కావడం, దీనిపై మోహన్‌బాబు స్పందించి ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేయడం.. చివరకు అదంతా ఒక రియాలిటీ షోలో భాగమని విష్ణు కవర్‌ చేయడం.. అందరికీ తెలిసిందే! రాఖీ పండగ రోజు మంచు లక్ష్మి షేర్‌ చేసిన ఫోటోలోనూ మనోజ్‌ ఉన్నాడు కానీ విష్ణు లేడు. దీంతో మంచు సోదరుల మధ్య విబేధాలు ఉన్నాయని జనాలు ఫిక్సయిపోయారు. ఈ క్రమంలో మంచు మనోజ్‌ సోదర బంధం గురించి గొప్పగా చెప్పాడు.

ఎప్పుడైతే ఈగోలు వస్తాయో..
సంపూర్ణేశ్‌బాబు సోదర సినిమాలోని సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మనోజ్‌ మాట్లాడుతూ.. 'సోదర బంధం చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే సోదరుల మధ్య ఈగోలు వస్తాయో.. ఇక అంతా అయిపోయినట్లే.. సోదరుల మధ్య ఈగోలు, డబ్బు సమస్యలు ఉండకూడదు. సమస్య ఎక్కడ వస్తుందంటే వాళ్లిద్దరూ కలిసి కూర్చోని మాట్లాడుకోరు. కాబట్టి ఏ సమస్య ఉన్నా ఎవరో ఒకరు తగ్గి కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, కుటుంబసభ్యులంతా కలిసి చర్చించుకోవాలి' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: పరశురామ్‌తో గొడవ..గతంలో జరిగింది ఇదే: బన్నీ వాసు

మరిన్ని వార్తలు