‘వార్షిక కౌలు’ వ్యాజ్యానికి విచారణార్హత ఉంది

8 Dec, 2023 05:18 IST|Sakshi

మీ సంఘాల్లోని ప్రతి సభ్యుడి పేరు మీద కోర్టు ఫీజు చెల్లించండి

రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితికి హైకోర్టు ఆదేశం  

సాక్షి, అమరావతి: రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించేలా సీఆర్‌డీఏను, రా­ష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అమరా­వతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణార్హత ఉందని హైకోర్టుస్పష్టం చేసింది. ఈ విషయంలో సీఆర్‌డీఏ లేవనెత్తిన అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే పిటిషన్లు దాఖలు చేసిన సంఘాల్లో ఉన్న సభ్యులందరి వివరాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించింది. అంతేకాక ఆ సంఘాల్లోని ప్రతి సభ్యుడి పేరు మీద కోర్టు ఫీజు చెల్లించాలని కూడా ఆదేశాలిచ్చింది.

ఇందుకోసం పది రోజుల గడువు ఇచ్చింది. తదుపరి వి­చారణను న్యాయస్థానం వా­యిదా వేసింది. ఈ మే­రకు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి గురు­వారం ఉత్త­ర్వులు జారీ చేశారు. వార్షిక కౌలు చెల్లించేలా ఆదేశాలివ్వా­లంటూ రైతుల తరఫు­న అమరా­వతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టులో పిటి­షన్‌ దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యం విచారణార్హతపై సీఆర్‌డీఏ అభ్యంతరం లేవనెత్తింది. రైతుల తరఫున సంఘాల పేరుతో పిటిషన్‌ దాఖలు చేయడానికి వీల్లే­దని సీఆర్‌డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్‌­మోహన్‌­రెడ్డి వాదన­లు వినిపించారు.

రైతులే నేరు­గా పిటి­షన్‌ దాఖలు చేసుకోవాలన్నారు. విచారణా­ర్హ­తపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్బారెడ్డి గురువారం తన నిర్ణయాన్ని వెలు­వరించారు. సీఆర్‌డీఏ అభ్యంతరాలను తోసిపు­చ్చా­రు. అయితే పిటిషన్‌ దాఖలు చేసిన రెండు సంఘా­ల్లో ఉన్న ప్రతీ సభ్యుడి పేరు మీద కోర్టు ఫీజు చెల్లించాలని ఆ సంఘాలను న్యాయమూర్తి ఆదేశించారు. 
 

>
మరిన్ని వార్తలు