రాష్ట్రంలో శాంతిభద్రతలు భేష్‌

25 Oct, 2023 05:06 IST|Sakshi

మహిళా రక్షణకుసీఎం జగన్‌ పెద్దపీట.. 

డీఎస్పీల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో హోంమంత్రి వనిత

అనంతపురం క్రైం: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్గనిర్దేశంలో పోలీస్‌ శాఖ అద్భుతంగా పని­చేస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. అనంతపురం పోలీసు శిక్షణ కళాశా­లలో ట్రైనింగ్‌ పూర్తిచేసుకున్న 28 మంది ప్రొబే­షనరీ డీఎస్పీల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ను సోమవారం పీటీసీ ఆవ­రణలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య­అతిథు­లుగా హోం మంత్రి తానేటి వనిత, డీపీజీ రాజేంద్రనాథ్‌ రెడ్డి హాజ­రయ్యారు.

హోంమంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా రాష్ట్రంలో మహిళల భద్రత, రక్షణ కోసం సీఎం జగనన్న ‘దిశ’యాప్‌ తీసుకొచ్చి పోలీస్‌­స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర­వ్యాప్తంగా దిశ యాప్‌ ద్వారా 30,500 మంది మహిళలు సహా­యం పొందారని చెప్పారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పోలీసు శాఖలోకి నూతనంగా ప్రవేశి­స్తున్న డీఎస్పీలు నిజాయితీగా, సమర్థవంతంగా, నిష్పక్ష­పాతంగా సేవలందించాలని సూచించారు.

డీజీపీ రాజేంద్ర­నాథ్‌రెడ్డి మాట్లాడుతూ సైబర్‌ నేరాల నియంత్రణ, సోషల్‌ మీడియా పోకడలను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలి­పారు. పోలీసులు ఒత్తిడికి లోనుకాకుండా బాధితులకు సకా­లంలో సేవలందించేందుకు కృషి చేయాల­న్నారు. అనంతపు­రం పీటీసీ ప్రిన్సిపాల్‌ వెంకట్రామిరెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ గీతా­దేవి, అనంతపురం, శ్రీసత్య­సాయి జిల్లాల ఎస్పీలు కేకేఎన్‌ అన్బురాజన్,  మాధవ­రెడ్డి, తాడిపత్రి బెటాలియన్‌ కమాండెంట్‌ గంగాధర్‌ రావు, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతి­నిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు