-

జప్తు చేసిన అగ్రిగోల్డ్‌ ఆస్తులపై మొదటి హక్కు రాష్ట్రానికే

28 Jul, 2023 03:23 IST|Sakshi

మేం మొదట జప్తు చేసిన ఆస్తులను ఈడీ తిరిగి ఎలా జప్తు చేస్తుంది?

ఇది ఎంత వరకు సమంజసమో తేల్చండి

అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఈ విషయంలో ప్రభుత్వ అధికారాన్ని ఎవరూ నిరోధించలేరు

ఈడీ చర్యలు డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం

డిపాజిటర్లకు ఇప్పటికే రూ.900 కోట్లు చెల్లించాం

హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌

తదుపరి విచారణ 31కి వాయిదా

సాక్షి, అమరావతి : జప్తు చేసిన అగ్రిగోల్డ్‌ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వానికే మొదటి హక్కు అని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌. శ్రీరామ్‌ హైకోర్టుకు నివేదించారు. డిపాజిటర్ల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒకే ఆస్తులపై రెండు దర్యాప్తు సంస్థల జప్తు ఉత్తర్వుల వల్ల డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘా­తం కలుగుతుందన్నారు. ఆస్తులను విక్ర­యించి డిపాజిటర్లకు ప్రయోజనం చేకూర్చా­లన్న ప్రభుత్వ ప్రయత్నాల్లో తీవ్ర జాప్యం జరిగి బాధితులు నష్టపోతారని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులను తిరిగి మనీ­లాండరింగ్‌ చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్ట­రేట్‌ (ఈడీ) జప్తు చేయడం ఎంత వరకు సమంజసమో తేల్చాలని కోర్టును అభ్యర్థించారు.మనీలాండరింగ్, దివాలా చట్టాల కింద చేసిన జప్తులకు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన జప్తునకు మధ్య వైరుద్ధ్యం లేదని తెలిపారు.డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అగ్రిగోల్డ్‌ ఎగవేసిన మొత్తాలను తిరిగి చెల్లిస్తోందని నివేదించారు. రూ.20 వేలు, అంత­కన్నా తక్కువ డిపాజిట్లు చేసిన వారికి ఇప్ప­టి­కే రూ.900 కోట్ల మేర తిరిగి చెల్లించినట్లు చెప్పారు. మనీలాండరింగ్, దివాలా చట్టాలు డిపా­జిటర్ల పరిరక్షణకు ఉద్దేశించినవి కావని చెప్పా­రు.

డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద డిపా­జి­టర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభు­త్వం చేపట్టిన చర్యలను ఈడీ గానీ, బ్యాంకులు గానీ నీరుగార్చలేవని అన్నారు. అగ్రిగోల్డ్‌ డిపా­జిట్ల కుంభకోణంలో నిందితులు వారిని వారు రక్షించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపా­రు.ఇలాంటి పరిస్థితుల్లో జప్తు చేసిన ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు తిరిగి చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని ఇత­ర ఏ దర్యాప్తు సంస్థా నిరోధించలేదని తేల్చి చెప్పారు. ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర ఉందని చెప్పారు.అగ్రిగోల్డ్‌ యాజమాన్యం నుంచి కొన్న తమ ఆస్తులను ఈడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ఆల్‌ ఇండియా అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

అలాగే బ్యాంకులు నిర్వహించిన వేలంలో కొన్న అగ్రిగోల్డ్‌ ఆస్తులను కూడా ఈడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ మరికొన్ని కంపెనీలు, వ్యక్తులు, కుంభకోణానికి ముందే అగ్రిగోల్డ్‌ నుంచి కొన్న భూము­ల్లో నిర్మించుకున్న అపార్ట్‌మెంట్లను సైతం సీఐడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ప్లాట్ల యజమానులు వేర్వేరుగా పిటిషన్లు దాఖ­లు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై న్యాయ­మూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి కొద్ది రోజులుగా విచారణ జరుపుతున్నారు. గురువారం జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. అనంతరం న్యాయమూర్తి విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు. 

మరిన్ని వార్తలు