నీడ దొరికిన వేళ..

31 Dec, 2020 08:41 IST|Sakshi
పెదవేగిలోని మోడల్‌ హౌస్‌

పేదోడి ఏళ్ల నాటి సొంతింటి కల సాకారం

జగనన్న దూరదృష్టితో అమిరిన గూడు

ప్రయోగాత్మకంగా పెదవేగిలో ఆదర్శగృహాలు

సాక్షి, దెందులూరు: పాదయాత్ర సమయంలో ఊరూరా నిరుపేద గూడు గోడు విన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. పేదలు సొంత ఇల్లు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నట్లు తెలుసుకుని “నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ వారికి అండగా నిలవాలని నిశ్చయించుకున్నారు. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే అర్హులు ఎంతమంది ఉంటే అందరికీ ఉచితంగా స్థలం ఇవ్వడమే కాక ఇంటిని నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా డిసెంబర్‌ 25వ తేదీ నుంచి రాష్ట్రమంతా అట్టహాసంగా ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభమైంది.

చరిత్రలో ఎన్నడూలేని విధంగా జిల్లాలో 1,70,699 మందికి సొంత ఇంటి కల నెరవేరింది. అంతే కాకుండా ఇంటి పట్టాతో పాటు ఇల్లు నిర్మాణానికి ఒక్కొక్కరికి 1,80,000 రూపాయలు నిధులు ఉచితంగా మంజూరు చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేరిట మంజూరు పత్రాలు సైతం అందజేస్తున్నారు. ఇళ్ల నిర్మాణ విషయమై లబ్ధిదారులకు మూడు అవకాశాలు ఇచ్చారు. ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వడం, లబ్ధిదారుడే ఇల్లు నిర్మించుకుంటే నిధులు మంజూరు చేయడంతో సగం ధరకే మెటీరియల్‌కు సంబంధించి నిధులు బ్యాంక్‌ ఖాతాకు జమ చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి చొరవతో ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు ఆదర్శ గృహాల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే కొందరు లబ్ధిదారులు కొత్త ఇళ్లల్లోకి మకాం మార్చడం విశేషం.

ఇంటి నిర్మాణం ఇలా.. 
ప్రతి ఇంట్లో వసారా, కిచెన్, రెండు బెడ్‌రూమ్‌లు, బాత్‌రూమ్, శ్లాబ్, ఇంటిపై వాటర్‌ ట్యాంక్‌ ఏర్పాటుతో నిర్మాణం చేసేట్లు గృహ నిర్మాణ శాఖ రూపొందించింది. 
సీఎం మరో నజరానా 
ఈ పథకానికి మరింత వన్నె తెచ్చేలా ప్రతి లబ్దిదారునికి ఉచితంగా రెండు ప్యాన్లు రెండు ట్యూబ్‌లైట్లను ప్రభుత్వమే సరఫరా చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

ఇన్నాళ్లకు కల తీరింది 
సొంత ఇంటిలో ఉండాలన్న నా కలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి నెరవేర్చారు. ఇంటి నిర్మాణం చేసి ప్రభుత్వం నాకు అందజేయటం, కుటుంబ సభ్యులతో మేము సొంత ఇంటిలో ఉండటం ఎన్నటికీ మరచిపోలేని విషయం. సీఎం, ఎమ్మెల్యేలకు రుణపడి ఉంటాం.  
– తొంటా సరస్వతి, లబ్ధిదారురాలు, పెదవేగి

ఇల్లు నిర్మించి అప్పగించాం 
పెదవేగిలో మోడల్‌ హౌస్‌ నిర్మించి లబ్ధిదారునికి అప్పగించాం. లబ్ధిదారుడు గృహ ప్రవేశం చేసి కుటుంబ సభ్యులతో ఆ ఇంటిలో నివాసం ఉండటం చాలా సంతోషంగా ఉంది. గృహ నిర్మాణాలపై లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యేందుకు సహకరించాలి. ఇళ్ల పట్టా, నిర్మాణ మంజూరు పత్రాలు ఒకేసారి అందజేస్తున్నాం.
– కొఠారు అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే 

సమష్టి కృషితో ఇళ్ల నిర్మాణం  
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారుల సమష్టి సహాయ, సహకారాలు, సూచనలతో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తాం. అధికారుల పర్యవేక్షణలో, పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది.  
– పి.రామచంద్రారెడ్డి, హౌసింగ్‌ పీడీ 

సమష్టి కృషితో ఇళ్ల నిర్మాణం  
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారుల సమష్టి సహాయ, సహకారాలు, సూచనలతో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తాం. అధికారుల పర్యవేక్షణలో, పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది.  
– పి.రామచంద్రారెడ్డి, హౌసింగ్‌ పీడీ

మరిన్ని వార్తలు