లక్ష ఎకరాలు సస్యశ్యామలం 

10 Jan, 2024 05:22 IST|Sakshi

రికార్డు సమయంలో నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి 

కరోనా కాలంతోపాటు పెన్నాకు పోటెత్తిన వరదల్లోనూ కొనసాగిన పనులు 

ఆయకట్టులో విస్తారంగా పంటల సాగు.. రైతుల్లో ఆనందోత్సాహాలు 

నెల్లూరు, 77 గ్రామాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

తప్పిన వరద ముప్పు 

జలయజ్ఞంలో భాగంగా పనులకు వైఎస్సార్‌ శ్రీకారం

కాలయాపన, కమీషన్లతో సరిపుచ్చిన టీడీపీ సర్కారు 

ప్రాధాన్యతగా చేపట్టి వాయువేగంగా పూర్తి చేసిన సీఎం జగన్‌  

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసుల వందేళ్ల స్వప్నం నెల్లూరు బ్యారేజీ సాకారం కావడంతో దాదాపు లక్ష ఎకరాల  ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లు అందుతున్నాయి. పెన్నా డెల్టాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా జలయజ్ఞంలో భాగంగా  దివంగత వైఎస్సార్‌ చేపట్టిన నెల్లూరు బ్యారేజీ పనులను  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు సమయంలో పూర్తి చేశారు. 2022 సెపె్టంబరు 6న బ్యారేజీని జాతికి అంకితం చేశారు.

అప్పటి నుంచి వరుసగా మూడేళ్లుగా సర్వేపల్లి, జాఫర్‌ సాహెబ్‌ కాలువల కింద సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల  పరిధిలోని ముత్తుకూరు, టీపీ గూడూరు, వెంకటాచలం,  ఇందుకూరుపేట, నెల్లూరు మండలాల్లోని 77 గ్రామాల్లో 99,525 ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా నీళ్లు అందడంతో విస్తారంగా పంటలు సాగు అవుతున్నాయి. నెల్లూరు బ్యారేజీలో ఏడాది పొడవునా 0.4 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా నెల్లూరుతోపాటు 77 గ్రామాల్లో తాగునీటి సమస్యను  సీఎం జగన్‌ శాశ్వతంగా పరిష్కరించారు.

నెల్లూరుతోపాటు బ్యారేజీ దిగువ గ్రామాలను ముంపు నుంచి కాపాడారు. నెల్లూరు బ్యారేజీ కమ్‌ రెండు వరసల రోడ్డు బ్రిడ్జిని పూర్తి చేయడం ద్వారా నెల్లూరు–కోవూరు మధ్య రవాణా సమస్యను సీఎం జగన్‌ శాశ్వతంగా పరిష్కరించారని నెల్లూరు జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   – సాక్షి, అమరావతి 

శిథిలమైన ఆనకట్ట స్థానంలో బ్యారేజీ.. 
నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదికి అడ్డంగా 1854–55లో 481.89 మీటర్ల వెడల్పుతో ఆనకట్టను నిర్మించిన బ్రిటిష్‌ సర్కార్‌ అరకొరగా ఆయకట్టుకు నీళ్లందిస్తూ వచ్చి ంది. పెన్నా నదికి 1862లో వచ్చి న భారీ వరదలకు ఆనకట్ట దెబ్బతినడంతో 621.79 మీటర్ల వెడల్పుతో 0.7 మీటర్ల ఎత్తుతో కొత్త ఆనకట్టను నిర్మించారు. పూడిక పేరుకుపోవడం, శిథిలమవడంతో ఆయకట్టుకు నీళ్లందించడం 1904 నాటికే సవాల్‌గా మారింది. నెల్లూరు తాగునీటి కోసం తల్లడిల్లింది.

ఈ ఆనకట్టకు దిగువన ఉన్న రోడ్డు ద్వారా నెల్లూరు–కోవూరు మధ్య రాకపోకలు సాగించేవారు. పెన్నా నదికి కాస్త వరద వచ్చినా నెల్లూరు–కోవూరుల మధ్య రాకపోకలు స్థంభించిపోయేవి. ఆనకట్ట వల్ల వరద వెనక్కి ఎగదన్ని నెల్లూరు నగరాన్ని ముంచెత్తేది. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆనకట్ట స్థానంలో బ్యారేజ్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జిని నిర్మించాలని 1904 నుంచి నెల్లూరు జిల్లా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

2004 వరకూ దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. జలయజ్ఞంలో భాగంగా నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని రూ.147.20 కోట్లతో దివంగత వైఎస్సార్‌ 2008 ఏప్రిల్‌ 24న చేపట్టారు. బ్యారేజీ పనుల కోసం రూ.85.82 కోట్లు ఖర్చు చేశారు. ఆయన హఠాన్మరణం నెల్లూరు బ్యారేజీకు శాపంగా మారింది.  

కరోనా.. భారీ వరదల్లోనూ.. 
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నెల్లూరు బ్యారేజీని ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. కరోనా ప్రతికూల పరిస్థితులు, పెన్నా చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా వరుసగా మూడేళ్లు భారీ వరదలు ఆటంకాలు సృష్టించినా బ్యారేజీలో రెండు మీటర్ల మందంతో 57 పియర్లను ప్రభుత్వం పూర్తి చేసింది. 51 గేట్లను, ఎలక్ట్రిక్‌ విధానంలో హాయిస్ట్‌ను ఏర్పాటు చేసింది.

రెండు వరుసల రోడ్‌ బ్రిడ్జిని నిర్మించారు. సర్వేపల్లి, జాఫర్‌ సాహెబ్‌ కాలువలకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్‌ను పూర్తి చేశారు. 0.4 టీఎంసీలను నిల్వ చేయడానికి వీలుగా బ్యారేజ్‌కు కుడి, ఎడమ వైపు కరకట్టలను పటిష్టం చేశారు. ఈ పనులకు రూ.88 కోట్లు ఖర్చు చేశారు. 

కాలయాపన.. కమీషన్లు 
రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్‌ నెల్లూరు బ్యారేజ్‌ పనులను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. పాత ఆనకట్టను పూర్తిగా తొలగించి బ్యారేజీ నిరి్మస్తున్న ప్రాంతానికి 20 మీటర్ల ఎగువన కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి ఆయకట్టుకు నీళ్లందిస్తూ బ్యారేజ్‌ నిర్మించాలని 2014లో ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చి ంది. 2016 వరకూ టీడీపీ సర్కార్‌ దీన్ని కనీసం పరిశీలించలేదు.

ఆ తరువాత అంచనా వ్యయాన్ని రూ.274.83 కోట్లకు సవరించి కాంట్రాక్టర్‌ నుంచి కమీషన్లు అధికంగా రాబట్టుకోవడానికి సులభంగా చేసే పనులకే ప్రాధాన్యం ఇచ్చి ంది. 2019 మే 29 వరకూ రూ.60.19 కోట్లను ఖర్చు చేసి బ్యారేజీలో 57 ఫియర్లను (కాంక్రీట్‌ దిమ్మెలు) పునాది కంటే ఒక మీటర్‌ ఎత్తు వరకు మాత్రమే చేయగలిగింది. 

ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు 
కరోనా, పెన్నా వరదలు లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ప్రాధాన్యతగా చేపట్టి నెల్లూరు బ్యారేజీని పూర్తి చేశాం. ఆయకట్టుకు సమృద్ధిగా నీటిని అందిస్తున్నాం. బ్యారేజీలో నిత్యం 0.4 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలమట్టం పెరుగుతుంది. సాగు, తాగు­­నీటి సమస్యను సీఎం జగన్‌ శాశ్వతంగా పరిష్కరించారు.   – సి.నారాయణరెడ్డి, ఈఎన్‌సీ, జలవనరుల శాఖ

ఆయకట్టు సస్యశ్యామలం..
పాదయాత్ర హామీని నిలబెట్టుకుంటూ నెల్లూరు బ్యారేజ్‌ను సీఎం జగన్‌ రికార్డు సమయంలో పూర్తి చేశారు. బ్యారేజీ పూర్తయ్యాక ఆయకట్టంతంటికీ సమృద్ధిగా నీళ్లందుతున్నాయి. 2022 నుంచి ఏటా రెండు పంటలు పండిస్తూ ఏడు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం. మంచి దిగుబడులు వస్తున్నాయి.  ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడంతో ప్రయోజనం పొందుతున్నాం. బ్యారేజీ మీదుగా నెల్లూరుకు సులభంగా వెళ్లి వస్తున్నాం.   – తన్నీరు అనిల్, రైతు, ఇందుకూరుపేట, నెల్లూరు జిల్లా 

నాడు కల.. నేడు నిజం
నెల్లూరు బ్యారేజీ ఒక కల. ఈ పనులను మహానేత వైఎస్‌ ప్రారంభిస్తే సీఎం జగన్‌ పూర్తి చేశారు. బ్యారేజ్‌ పూర్తికాక ముందు ఆయకట్టుకు నీళ్లందకపోవడంతో 3.5 ఎకరాల్లోనే పంటలు సాగు చేశా. ఇప్పుడు సొంత పొలంతోపాటు 20 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేస్తున్నా. మంచి దిగుబడులు వస్తున్నాయి. గిట్టుబాటు ధర దక్కుతోంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతానని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారు.  – వాకాటి మహేష్, ఇందుకూరుపేట, నెల్లూరు జిల్లా 

నెల్లూరు బ్యారేజీ స్వరూపం ఇదీ..
ఎక్కడ?: నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదిపై  (మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీకి 20 కి.మీ. దిగువన) 
పరీవాహక ప్రాంతం: 51,800 చదరపు కిలోమీటర్లు 
బ్యారేజీ పొడవు: 640 మీటర్లు (బ్యారేజీకి అనుబంధంగా రెండు వరుసల రోడ్‌ బ్రిడ్జి) 
గేట్లు: 51 (పది మీటర్లు ఎత్తు, 3 మీటర్ల వెడల్పుతో 43 గేట్లు.. 10 మీటర్లు ఎత్తు, 4.3 మీటర్ల ఎత్తుతో 8 స్కవర్‌ స్లూయిజ్‌ గేట్లు) 
గేట్ల మరమ్మతుకు సిద్ధం చేసిన స్టాఫ్‌లాగ్‌ గేట్లు: 6 
గేట్ల నిర్వహణ: వర్టికల్‌ లిఫ్ట్‌ 
గరిష్ట నీటి మట్టం: 14.3 మీటర్లు 
గరిష్ట వరద విడుదల సామర్థ్యం: 10,90,000 క్యూసెక్కులు 
ఆయకట్టు: 99,525 ఎకరాలు 
గరిష్ట నీటి నిల్వ: 0.4 టీఎంసీలు 
అంచనా వ్యయం: రూ.274.83 కోట్లు 
వైఎస్సార్‌ హయాంలో చేసిన వ్యయం: రూ.85.82 కోట్లు 
కనీస నీటి మట్టం: 11.3 మీటర్లు 
టీడీపీ హయాంలో వ్యయం: రూ.60.19 కోట్లు (కాంట్రాక్టర్‌ నుంచి అధికంగా కమీషన్లు వసూలు చేసుకోవడానికి సులభమైన పనులను మాత్రమే చేపట్టారు) 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం: రూ.88 కోట్లు  

>
మరిన్ని వార్తలు