ఐఏఎస్‌ ఎండీ ఇంతియాజ్‌కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ 

15 Jul, 2021 04:11 IST|Sakshi

కోర్టు ముందు హాజరుపర్చాలంటూ విజయవాడ పోలీస్‌ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం  

సాక్షి, అమరావతి:  కోర్టు ధిక్కార కేసులో కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్‌ ఎండీ ఇంతియాజ్, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎం.శ్రీనివాసరావులకు హైకోర్టు బుధవారం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌(ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేసింది. ఈ వారెంట్‌ను అమలు చేసి ఇద్దరినీ కోర్టు ముందు హాజరుపరచాలని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఉత్తర్వులిచ్చారు.

వైఎస్సార్‌ చేయూత పథకానికి తాము అర్హులమైనా, ఆ పథకాన్ని తమకు వర్తింపజేయడం లేదంటూ కృష్ణా జిల్లా, చందర్లపాడుకు చెందిన పలువురు మహిళలు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు, వారికి వైఎస్సార్‌ చేయూత పథకాన్ని వర్తింపజేయాలంటూ ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాల మేరకు 2020–21 సంవత్సరానికి నిధులు విడుదల చేశారు. అయితే 2019–20 సంవత్సరానికి నిధులు ఇవ్వకపోవడంపై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. బుధవారం ఈ పిటిషన్‌ విచారణకు రాగా, ఇంతియాజ్, శ్రీనివాసరావులు కోర్టు ముందు స్వయంగా హాజరు కాలేదు. వారి తరఫు న్యాయవాదులు కూడా హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి ఆ అధికారులిద్దరికీ నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.   

మరిన్ని వార్తలు