AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల

6 Mar, 2023 14:04 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఈనెల ఆఖరుకు ఖాళీ అవుతున్న ఏడు ఎంఎల్ఏ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సంయుక్త కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు.

కాగా, శాసన మండలి సభ్యులు చల్లా భగీరధ్ రెడ్డి పదవీ కాలం గత నవంబరు 2వ తేదీతో పూర్తి కాగా, ప్రస్తుత సభ్యులు నారా లోకేశ్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద రావు, వరాహ వెంకట సూర్యనారాయణ రాజు పెనుమత్స, గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం ఈనెల 29తో ముగియనుంది. ఈ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖాళీల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గతనెల 27వతేదీన ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. దీంతో, సోమవారం ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రకటనను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఎంఎల్ఏ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎన్నికకు సంబంధించి ఫారమ్-1 ద్వారా ఎన్నికల ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధులు స్వయంగా లేదా వారి ప్రతిపాదకుడి ద్వారా అయినా వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభా భవనంలో రిటర్నింగ్ అధికారి వద్ద లేదా సహాయ రిటర్నింగ్ అధికారి, శాసన మండలి ఉపకార్యదర్శికి వారి నామినేషన్లను సమర్పించవచ్చని సుబ్బారెడ్డి తెలిపారు. 

ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నాం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలను పైన పేర్కొన్న స్థలం, సమయాల్లో పొందవచ్చని వివరించారు. ఈ నెల 14వతేదీన ఉదయం 11గంటలకు అసెంబ్లీ భవనంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుందని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈనెల 16వతేది మధ్యాహ్నం 3గంటల వరకూ నామినేష్ల ఉసంహరణకు గడువు ఉంటుందన్నారు. ఆ గడువులోగా ఎవరైనా అభ్యర్ధులు వారి నామినేష్లనను ఉపసంహరించుకోవచ్చునని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 23వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ అసెంబ్లీలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తైన వెంటనే అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు