ప్రవాసాంధ్రుల దాతృత్వం

29 Jun, 2021 16:45 IST|Sakshi

రూ.4.28 కోట్ల విలువైన వైద్య సామగ్రి వితరణ

ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రులకు పంపిణీ

పంపిణీ ఏర్పాట్లు పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి, మల్లాది విష్ణు  


సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ కట్టడి చర్యలకు ప్రవాసాంధ్రులు సాయం అందించారు. సుమారు రూ.4,28, 08,885 విలువైన వైద్య పరికరాలను ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సంస్థ ద్వారా ప్రభుత్వాస్పత్రులకు అందించారు. సోమవారం తాడేపల్లిలోని ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షుడు వెంకట్‌ ఎస్‌ మేడపాటి, సీఈవో కె.దినేష్‌కుమార్, భవకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి అవసరమైన వైద్య పరికరాల వివరాలను స్టేట్‌ కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో సమన్వయం చేసుకుంటూ ప్రవాసాంధ్రుల నుంచి వాటిని సేకరించడంలో ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ విశేష కృషి చేస్తోందంటూ కొనియాడారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకత్వంలో ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ పనిచేస్తోందని  వెంకట్‌ మేడపాటి అన్నారు. ఏపీకి  వైద్య పరికరాలను పంపాలనుకునే వారికి వివిధ దేశాల్లో ఉన్న తమ కోఆర్డినేటర్లు సాయం అందిస్తున్నట్లు వివరించారు.  ఇప్పటివరకు రాష్ట్రంలోని 70 ఏరియా, పెద్దాస్పత్రులకు వైద్య సామగ్రి పంపిణీ జరిగిందన్నారు. ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణానికి సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ, గుంటూరు మెడికల్‌ కాలేజీలకు చెందిన పూర్వ విద్యార్థి సంఘాలు ముందుకు రావడం హర్షణీయమన్నారు.  

చదవండి : ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం జగన్

మరిన్ని వార్తలు